విజయవాడలో కరోనా నుంచి కోలుకున్న తొలి పేషెంట్- ఎలా జయించాడో తన మాటల్లో..
విజయవాడలో కరోనా బారిన పడిన ఓ బాధితుడు కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న హేమంత్ అనే విద్యార్ధి ఇవాళ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. అతన్ని కొన్ని రోజుల పాటు ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చాక హేమంత్ తనతో పాటు కరోనా సోకిన రోగులకు ధైర్యం చెప్పాడు.
కరోనా బారి నుంచి విముక్తి..
పారిస్ నుంచి విజయవాడకు రెండు వారాల క్రితం వచ్చిన హేమంత్ అనే విద్యార్ధి కరోనా వైరస్ ను జయించాడు. రెండు వారాల క్రితం నగరంలోని కొత్తపేటలో ఉన్న తన నివాసానికి వచ్చిన హేమంత్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్ తర్వాత హేమంత్ కు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ గా తేలడంతో హేమంత్ ను ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
అధికారులు, సన్నిహితుల చప్పట్ల మధ్య...
హేమంత్ రెండు వారాల క్వారంటైన్ తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని ముందే తెలియడంతో అధికారులతో పాటు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ ఆస్పత్రికి చేరుకున్నారు. హేమంత్ బయటికి రాగానే చప్పట్లతో స్వాగతం పలికారు. కరోనా నుంచి కోలుకుని హేమంత్ బయటికి రావడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు.
కరోనాను ఎలా జయించానంటే..
కరోనా వైరస్ సోకిన తర్వాత విజయవాడలో ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి వైద్యులు తనను ఎంతో బాగా చూసుకున్నారని హేమంత్ తెలిపాడు. కరోనాను సునాయాసంగా జయించవచ్చని, మెడిసిన్ లేకపోయినా వ్యాక్సినేషన్ ఉందని, ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని హేమంత్ బాధితులకు ధైర్యం చెప్పాడు. రోగులకు భయం ఉండటం సహజమే అయినా వైద్యులు చక్కగా ట్రీట్ మెంట్ ఇస్తున్నారని హేమంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనా వచ్చిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సమాజంలో వైరస్ విస్తరించకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హేమంత్ సూచించాడు.