ఉలిక్కిపడ్డ విజయనగరం జిల్లా: తొలి కరోనా కేసు నమోదు? డయాలసిస్ కోసం విశాఖకు వచ్చిన మహిళకు
విజయనగరం: ఇప్పటిదాకా కరోనా రహిత జిల్లాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయనగరంలో కరోనా ఛాయలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన ఈ జిల్లాలో ఆ మహమ్మారి అడుగు పెట్టిందనే వార్త ఒక్కసారిగా గుప్పుమంటోంది. దీనిపై అటు విజయనగరం జిల్లా అధికారులు గానీ, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గానీ ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అన్నీ ధృవీకరించుకున్న తరువాత.. ఈ విషయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు.
డయాలసిస్ కోసం తరచూ విశాఖకు..
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెకు డయాలసిస్ చేయిస్తున్నారు. దీనికోసం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తరచూ విశాఖపట్నంలోని ఓ ఆసుప్రతికి వస్తుండేవారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉన్నందున.. ఆమె అధికారులు విశాఖకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు.
విశాఖ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు..
ఈ నేపథ్యంలో.. మూడు రోజుల కిందట ఆమె తన స్వగ్రామం చిలకలపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లారు. ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి నర్సులు ఆమెకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు. రక్తం, ఇతర నమూనాలను సేకరించారు. దాన్ని విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్)కు పంపించారు. అనంతరం ఆమె తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన తరువాత కరోనా వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చింది. ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించారు. వైరస్ లక్షణాలు ఆమెలో కనిపించాయని తేల్చారు.
నివేదిక రాకముందే.. ఇంటికి..
ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే జిల్లా కోవిడ్-19 నోడల్ అధికారికి తెలియజేశారు. దీనితో అధికారులు హుటాహుటిన చిలకలపల్లి గ్రామానికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులందరినీ విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్ వీ రమణకుమారి తెలిపారు. అనంతరం పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని క్వారంటైన్కు తరలిస్తామని అన్నారు. చిలకలపల్లి గ్రామానికి రాకపోకలను నిషేధించారు.
Recommended Video
ఉలిక్కిపడ్డ విజయనగరం..
ఈ ఘటనతో విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకని జిల్లాగా పేరున్న విజయనగరంలో తొలి కేసు నమోదు కావడం చర్చనీయాంశమౌతోంది. పొరుగు ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించడానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ అధికారులు కరోనా వైరస్ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతా చేస్తున్నప్పటికీ.. చిలకలపల్లికి చెందిన ఆ మహిళకు వైరస్ సోకిందనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. డయాలసిస్ కోసం విశాఖపట్నం ఆసుప్రతికి వెళ్లిన సమయంలో లేదా, రాకపోకలు సాగిస్తున్న సందర్భంలో ఆమెకు వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.