ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి నాడే ఆందోళనతో ప్రారంభమయ్యాయి. సామాన్యులు కొనలేని స్థితిలో ఉల్లి ధరలు చేరడంతో విపరీతంగా పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా ఏపీ టిడిపి నేతలు నిత్యావసర వస్తువుల ధరలపై వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక అంతే కాదు ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మెడలో ఉల్లి దండలతో నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొలిరోజే ఉద్రిక్తత నెలకొంది. ఇక దాంతోపాటు ప్రస్తుత ఏపీ అసెంబ్లీ లో విద్యుత్ పీపీఏలపై రచ్చ కొనసాగుతోంది.
అసెంబ్లీ సమావేశాల తొలినాడే రచ్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అధికార,ప్రతిపక్ష పార్టీలనేతలు శాసనసభ సమావేశాల్లో వ్యూహ,ప్రతివ్యూహాలతో సమావేశాలకు హాజరయ్యారు.నవరత్నాలలో రోజుకొక పథకంపై చర్చ పెట్టి,ప్రతిపక్షాలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని వ్యూహాత్మకంగా వైసీపీ ప్లాన్ చేసింది.ఇక రాష్ట్రంలో తాజా పరిణామాలు రాజధాని రగడ,చంద్రబాబు కాన్వాయ్ పై దాడి,నిత్యావసర వస్తువుల ధరలు,ఏపీలో మంత్రుల బూతు పురాణం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగానే ఒత్తిడి పెట్టాలని టిడిపి భావిస్తోంది.
విద్యుత్ ఒప్పందాల విషయంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
ఇక ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన పీపీఏలపై సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొలిరోజే తొలి చర్చే రసాభాసగా మొదలైంది విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టిడిపి నిలదీసింది. అంతేకాదు గత ఆరు నెలల విద్యుత్ పీపీఏల పై ఏం చేశారని ప్రశ్నించింది.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని టీడీపీనేత నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు
ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్యతో విలవిల్లాడుతున్నదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. ఇక పీపీఏలపై కమిటీ వేసి అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.ఇక గతంలో టిడిపి హయాంలో విద్యుత్ పీపీఏలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారో దీనికి సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
టీడీపీ పై రివర్స్ ఎటాక్ చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఈ పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసిందని ఆరోపించారు.ఇక డిస్కంలను మొత్తానికి కుప్పకూల్చే పరిస్థితికి వచ్చిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై గత ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకున్నారని బుగ్గనమండిపడ్డారు. ప్రతీ దాన్ని రాజకీయం చేయొద్దంటూ బుగ్గన టీడీపీ నేతలకి సూచించారు.గత ప్రభుత్వ తప్పులను ప్రజలు సమర్థించాలా? అని ప్రశ్నించారు. బాబు హయాంలో డిస్కంలకు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. అన్నిటినీ పరిశీలించి సరైన సమయంలో ప్రభుత్వం నివేదిక ఇస్తుందని బుగ్గన పేర్కొన్నారు.