అమరావతి యాత్రకు మరో అడ్డంకి ? తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీల కలకలం-ఈసారి ఏకంగా మంత్రిగారే..
ఏపీలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మరో అడ్డంకి తప్పేలా లేదు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలినాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో అడ్డంకుల్ని అధిగమించిన రైతుల పాదయాత్రకు ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని తాడేపల్లిగూడెంలో మరో అడ్డంకి తప్పడం లేదు. రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తూ స్వయంగా మంత్రి కొట్టు సత్యనారాయణ పెట్టించిన ఫ్లెక్సీలే ఇందుకు కారణం.మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.
అమరావతి పాదయాత్ర
అమరావతి నుంచి అరసవిల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఇవాళ తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించబోతోంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్ని దాటిన ఈ యాత్ర.. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సాగుతోంది. తాడేపల్లిగూడెం వైసీపీకి చెందిన దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పటికే సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రధాన నేతలంతా అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా ఉన్న వేళ మంత్రి గారు కూడా దీనిపై అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు.
తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీల కలకలం
అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా తాడేపల్లి గూడెంలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతుల పాదయాత్ర ఫేక్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫొటోలతో ఈ ఫ్లెక్సీలు వేయించారు. ఇందులో చంద్రబాబు భ్రమరావతిని నమ్ముకున్నారని, జగన్ సమైక్య వాది అని, వికేంద్రీకరణే ముద్దు అని ఇలా వేర్వేరు నినాదాలతో వేయించిన ఫ్లెక్సీలు తాడేపల్లిగూడెంలో కలకలం రేపుతున్నాయి. రైతుల పాదయాత్ర వేళ వారిని రెచ్చగొట్టేందుకే మంత్రి ఈ ఫ్లెక్సీలు పెట్టించారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
మంత్రి కొట్టుకు చింతమనేని సవాల్
రైతుల పాదయాత్ర ఫేక్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ వేయించిన ఫ్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. రైతుల పాదయాత్ర ఫేకో మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.దమ్ము ధైర్యం ఉంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు కంటే ఎక్కువ ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పైన నిరసన తెలపాలని చింతమనేని సవాల్ విసిరారు. ఉన్మాద ముఖ్యమంత్రి మెప్పుకోసం మంత్రి పదవి ఊడుతుందేమో అని భయంతో ఇటువంటి ప్లెక్సీలు కట్టించడాన్ని ఎవరూ హర్షించరన్నారు. దీంతో ఇవాళ తాడేపల్లి గూడెంలో రైతుల పాదయాత్ర వైసీపీ వర్సెస్ విపక్షాల పోరుగా మారబోతోంది.