‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’.. 7 ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు తొలి పయనం
ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఆక్సిన్ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఎక్ప్ప్రెస్ పేరిట ఓ ప్రత్యేక రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రైలు గురువారం తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏడు ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేసేందుకు బయల్దేరింది.
విశాఖ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ట్యాంకర్లు..
గురువారం ఉదయం నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏడు ఆక్సిజన్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) నింపారు. ఆ తర్వాత ఆ ట్యాంకర్లు అక్కడ్నుంచి ఆక్సిజన్ ఎక్సెప్రెస్ రైలు వద్దకు చేరాయి. గురువారం సాయంత్రం ఆ రైలుపైనే ఏడు ఆక్సిజన్ ట్యాంకర్లు విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు బయల్దేరాయి. శుక్రవారం ఉదయం మహారాష్ట్రకు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరనున్నాయి.
ప్రతి ట్యాంకులో 15 టన్నుల ఆక్సిజన్..
'ప్రతి ట్యాంకర్లో 15 టన్నుల ఎల్ఎమ్ఓతో లోడ్ చేయబడింది. రైలు సాయంత్రం మహారాష్ట్ర వైపు వెళ్లడం ప్రారంభించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన వాల్టెయిర్ డివిజన్, ఆర్ఐఎన్ఎల్ అధికారులు సంయుక్తంగా చేసిన ప్రయత్నం ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో ఇది ప్రయోజనకరంగా ఉంది' అని రైల్వే తెలిపింది.
ఫస్ట్ రన్ అంటూ పీయూష్ గోయల్ ట్వీట్
ఆర్ఐఎన్ఎల్ సంస్థ నుంచి రైలు బయటికి వెళ్లడానికి సిద్ధమవుతున్న వీడియోను రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. 'లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లతో నిండిన మొట్టమొదటి 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' రైలు వైజాగ్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరింది. అవసరమైన వస్తువుల రవాణా, పౌరులందరి శ్రేయస్సును నిర్ధారించడానికి ఆవిష్కరణలను నడిపించడం ద్వారా రైల్వేలు కష్ట సమయాల్లో దేశానికి సేవలను కొనసాగిస్తున్నాయి' అని పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆక్సిజన్ కొరతతో పలువురు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలి రైలు గురువారం విశాఖ నుంచి మహారాష్ట్రకు బయల్దేరింది. మరోవైపు ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న తరుణంలో దేశానికి అత్యవసరమైన సమయంలో ఆక్సిజన్ అందిస్తూ అమూల్యమైన సేవలందిస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.