హోదాపైనే తొలి సంతకం: రాహుల్ హామీ, జైట్లీ-మోడీలపై సంచలన ఆరోపణలు
Recommended Video
కర్నూలు: కాంగ్రెస్ పార్టీకి ఏపీతో మంచి అనుబంధం ఉందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. కర్నూలులో నిర్వహించిన సత్యమేవ జయతే సభలో ఆయన మాట్లాడారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్యను చేసింది కాంగ్రెస్ అన్నారు. ఆయన అవినీతిపరుడు అంటూ కొందరు నెహ్రూకు అప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిజానిజాలు తెలుసుకునేందుకు నెహ్రూ కర్నూలుకు ఓ బృందాన్ని పంపించారని తెలిపారు. సంజీవయ్య కుటుంబం నిరుపేద కుటుంబమని నెహ్రూ విచారణలో తేలిందని, అలాంటి సీఎం ఏపీకి కావాలన్నారు.
రూ.500తో పోయే బాబ్లీ కేసుపై రాద్ధాంతం, జగన్కిస్తే అలా, మీకు వస్తే ఇలా: బాబుపై విష్ణు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. కానీ అయిదేళ్లు కాదు... పదేళ్లు ఇవ్వాలని బీజేపీ కొట్లాడిందని చెప్పారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఏపీకి సాయం చేయలేదన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైనే తొలి సంతసం చేస్తామన్నారు.
నరేంద్ర మోడీలా తప్పుడు హామీలు ఇచ్చే అలవాటు లేదు
పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ తుంగలో తొక్కారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి పలు హామీలు ఇచ్చారని తెలిపారు. 2014లో మోడీ ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చారని, కానీ అలాంటి తప్పుడు హామీలు ఇచ్చే అలవాటు తనకు లేదన్నారు. దేశానికి ప్రధానిగా కాదు.. కాపలాదారుగా ఉంటానని మోడీ చెప్పారని అన్నారు. దేశానికి దశ, దిశ చూపిన రాష్ట్రం ఏపీ అన్నారు.
విజయ్ మాల్యా దోచుకొని పారిపోయాడు
విజయ్ మాల్యా రూ.9వేల కోట్లు దోచుకొని బ్రిటన్ పారిపోయాడని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మాల్యా లండన్ పారిపోవడానికి ముందు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారని విమర్శించారు. కాగా ఇటీవల మాల్యా మాట్లాడుతూ.. తాను భారత్ వచ్చే ముందు జైట్లీని కలిశానని చెప్పారు. కాసేపట్లో కలవలేదని మళ్లీ మాట మార్చారు. మోడీ నిజమైన కాపాలాదారు అయితే జైట్లీని తొలగించాలన్నారు. మాల్యాను వదిలేందుకు జైట్లీ ఎంతకు డీల్ కుదుర్చుకున్నారని నిలదీశారు. ఇంత జరుగుతుంటే మోడీ మౌనంగా ఉన్నారన్నారు. దొంగతో పోలీసు కుమ్మక్కయినట్లు మాల్యాతో జైట్లీ కుమ్మక్కయ్యారన్నారు.
మాల్యా రూ.9వేల కోట్లు దోచుకుంటే అనిల్ అంబాని రూ.45వేల కోట్లు
రాఫెల్ యుద్ధ విమానాల పేరుతో భారీ స్కాం చేశారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ రూ.526 కోట్లతో విమానాన్ని కొనుగోలు చేస్తే, మోడీ ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించారన్నారు. పార్లమెంటులో తన ప్రశ్నకు మోడీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. నా కళ్లలోకి చూసే ధైర్యం మోడీకీ లేదన్నారు. హెచ్ఐఎల్ ఒప్పందం నుంచి తప్పించి మిత్రుడైన అనిల్ అంబానికి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. మాల్యా రూ.9వేల కోట్లు దోచుకుంటే అంబానీ రూ.45వేల కోట్లు దోచుకున్నారు. మోడీ 15 మంది కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్లు దోచి పెట్టారన్నారు.
జగన్, చంద్రబాబులపై కిరణ్ రెడ్డి, కోట్ల ఆగ్రహం
బీజేపీని, బీజేపీతో దోస్తీ చేసిన చంద్రబాబును, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్మగలమా అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ ఎక్కడా మాట్లాడటం లేదన్నారు. వైసీపీకి అధికార ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. మోడీ పతనం ఖాయమని, తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో అన్నీ ఇబ్బందులే అన్నారు. టీడీపీ, వైసీపీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ బతికే ఉంటుందన్నారు.
ఏపీ స్వయం సహాయక సంఘాలపై ప్రశంసలు
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని రాహుల్ గాంధీ అంతకుముందు యువతతో భేటీ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నవ్యాంధ్రకు హోదా కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం, మద్దతు అవసరమని చెప్పారు. కానీ కేంద్రం నుంచి సరైన సహకారం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ కల్పనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రతి రోజు చైనా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తోందని చెప్పారు. అదే మన దేశంలో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ కొందరి చేతుల్లో చిక్కుకుపోయి ఉందన్నారు. కొంతమంది కార్పోరేట్ల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల పనితీరు చాలా బాగుందని చెప్పారు. మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కితాబిచ్చారు. పురుషులతో సమానంగా మహిళలను కొందరు చూడటం లేదని, కానీ పురుషుల్లా స్త్రీలు కూడా ఏమైనా చేయగలరని తాను విశ్వసిస్తానని చెప్పారు.