ఎన్టీఆర్ని తొలిసారి అక్కడే చూశా, ప్రేమ ఎప్పుడు పుట్టిందో: లక్ష్మీపార్వతి
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో పరిచయం, వారి పెళ్లికి దారితీసిన అంశాలను పంచుకున్నారు. ఏపీ భవన్లో ఎన్టీ
హైదరాబాద్/అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో పరిచయం, వారి పెళ్లికి దారితీసిన అంశాలను పంచుకున్నారు. ఏపీ భవన్లో ఎన్టీఆర్ను తొలిసారి కలిసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
Recommended Video
'బాబు కుట్ర, భయమేసేది! ఇష్టం లేకుండా మొదటి పెళ్లి, ఎన్టీఆర్ వల్లే మళ్లీ': లక్ష్మీపార్వతి సంచలనం
అప్పుడు ఆనందపడ్డా..
‘నేను ఉపన్యాసాలు చెప్పే దానిని. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా నాడు ఢిల్లీ ఏపీ భవన్లో నా ఉపన్యాసం ఉంది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు గారి చేతులమీదుగా సన్మానం ఉంటే వెళ్లాను. నేను మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి వీరాభిమానిని. దీంతో ఎన్టీఆర్ని చాలా దగ్గరగా చూడబోతున్నానని ఆనందపడ్డాను' అని లక్ష్మీపార్వతి తెలిపారు.
సూర్యబింబంలా..
అంతేగాక, ‘ఆరోజు ఉదయం ఎన్టీఆర్ని కలిసి ఫొటో దిగాలని ఆయన బస చేసిన గది వద్దకు వెళ్లాను. అక్కడ ఉన్న ఒకరు నన్ను ప్రశ్నించగా ఈ విషయం చెప్పాను. అక్కడే నిలబడి ఉండమని నాకు చెప్పారు. ఇంతలో గది తలుపులు తెరచుకుని ఎన్టీఆర్ బయటకు వచ్చారు. కాషాయ వస్త్రం ధరించిన ఓ సూర్యబింబంలా ఆయన ఉన్నారు' అని లక్ష్మీపార్వతి తెలిపారు.
ఆనందంతో ఎన్టీఆర్ కాళ్లపై పడిపోయా..
‘అలా ముందుకు వచ్చిన ఎన్టీఆర్నిఅలానే చూస్తూ నిలబడిపోయాను. ఈలోగా, ‘ఫొటో తీసుకో అమ్మా' అని సదరు వ్యక్తి అన్నారు. నేను వెంటనే ఎన్టీఆర్ కాళ్లపై పడిపోయాను. నా చేతిలో ఉన్న కెమెరా కిందపడిపోయింది.. నా కళ్లలో నుంచి ఆనందభాష్పాలు వచ్చేశాయి. ఎన్టీఆర్ నన్ను పైకి లేపారు. నా వివరాలు అడిగి తెలుసుకున్నారు' అని లక్ష్మీ పార్వతి తమ తొలి కలియికను వివరించారు.
ప్రేమ ఎప్పుడు చిగురించిందో..
ఆ తర్వాత ఎన్టీఆర్తో తొలిసారి మాట్లాడినట్లు తెలిపారు. ‘లెక్చరర్గా పనిచేస్తున్నానని ఆయనకు చెప్పాను. ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఫొటో తీసుకోలేదు కానీ, మీరే తియ్యండి' అని నన్ను తన పక్కన నిలబెట్టుకుని ఎన్టీఆర్ ఫొటో తీయించారు. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందనేది చెప్పలేను' అని లక్ష్మీపార్వతి తెలిపారు. కాగా, ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిన విషయం తెలిసిందే.
ఆయన మాట్లాడాలని తపనపడ్డాను..
ఆ తర్వాత హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీలో నాడు ఎంఫిల్లో తనకు సీటొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ని కలిసేందుకు వెళ్లానని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాలుగైదు సార్లు ఆయన్ని కలిశానని చెప్పారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ బిజీ అయిపోవడం, ఆ ఎన్నికల్లో వారి పార్టీ ఓడిపోవడం జరిగిందని లక్ష్మీపార్వతి తెలిపారు.ఎన్నికల్లో ఓటమి పాలైన ఎన్టీఆర్ని కలిసి ఆయనతో మాట్లాడాలని తాను చాలా తపన పడ్డానని అన్నారు.
బాధపడే మనిషిని కాదన్నారు..
‘ఆబిడ్స్లోని ఆయన నివాసానికి నేను ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆయన నాచారంలో ఉంటున్నారని అక్కడి వాళ్లు చెప్పారు. నాచారంలో ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్లాను. చివరకు, నాచారం స్డూడియోకు వెళ్లాను. అక్కడి వరండాలో పడక కుర్చీలో ఎన్టీఆర్ కూర్చుని ఉన్నారు. నాలుగైదేళ్ల వయసు పైబడిన వారిలా.. చాలా భారంగా అప్పుడు ఆయన ఉన్నారు. నేను ఆ వరండాలోనే కింద కూర్చున్నాను. దీంతో ‘లక్ష్మీపార్వతి గారు కుర్చీలో కూర్చోండి' అని ఎన్టీఆర్ అన్నారు. ‘వద్దు స్వామీ కిందే కూర్చుంటాను' అంటూ ఆయనకు నమస్కారం చేశాను. ‘స్వామీ! ఎందుకలా ఉన్నారు? ఎన్నికల్లో ఓడిపోయారని బాధపడుతున్నారా?' అని అడిగా. ‘అదేం లేదు, దాని గురించి పెద్ద బాధ లేదు. నేను బాధపడే మనిషిని కాదని ఆయన అన్నారు' అని లక్ష్మీపార్వతి తెలిపారు.
ఆ మాటతో ఎన్టీఆర్ ముఖంలో కళ..
‘మీరు ఉత్సాహంగా లేరు. నేను చిన్నదానిని అయినప్పటికీ, మీకో మాట చెబుతాను. దయచేసి, ఏమీ అనుకోవద్దు. ‘అధికారమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అధికారం కోసం మీరు వెతుక్కుంటూ పోలేదు. జరిగిన లోపాలను పరిశీలించుకోవడానికి దొరికిన అవకాశంగా ఈ ఓటమిని మీరు భావించండి స్వామి. అంతేతప్పా, మీరు ఓడిపోయారని అనుకోవద్దు. అది ప్రజల దురదృష్టం' అని ఎన్టీఆర్తో నేను అనగానే ఆయన మొఖంలో కొంచెం కళ వచ్చింది' అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. ఇలా అనాటి ఆసక్తికర అంశాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. కాగా, ఇది ఇలా ఉండగా, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరి పరిచయం, ప్రేమ, పెళ్లిపై లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను రూపొందిస్తున్నారు.