కేరళ వైఖరితో గుంటూరు మత్స్య పరిశ్రమకు నష్టం:నిజాంపట్నంలో మత్స్యకారుల నిరసన
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ మత్స్యసంపద పై ఇతర రాష్ట్రాల అధికారిక, అనధికార నిషేధాల కారణంగా రాష్ట్ర మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇటీవలే మన రాష్ట్రాల చేపల ఎగుమతుల్లో ఫార్మాలిన్ ఎక్కువగా ఉందని నిషేధం విధించగా తాజాగా మరో కారణంతో కేరళ ప్రభుత్వం ఇదే బాటపట్టింది.
దీంతో కేరళ ప్రభుత్వం తీరు తమ పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా నిజాంపట్నం మత్స్యకారులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఎటువంటి పరీక్షలు జరపకుండానే జరపకుండా మన చేపల నాణ్యత బాగోలేదని మత్స్యసంపద ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం వైఖరి మారాలంటూ నిజాంపట్నంలో మత్స్యకారులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు.
అసలు...ఏం జరిగిందంటే?
ఈ నెల 18న గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ నుంచి కండవాయికి చేపల లోడుతో వెళ్లిన ఒక వాహనాన్ని కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చేపల నాణ్యత ఏమాత్రం బాగోలేదని వాటిని డంపింగ్యార్డులో పారబోయించారట. అలా 25 లక్షల రూపాయల విలువ చేసే చేపలను నిర్ధాక్షిణ్యంగా, వృధాగా పారబోయించారని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక బాక్స్ ను కంటితో చూసి చేపల నాణ్యతను నిర్థారించడం ఎలా సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు.
భారీ నష్టం...ఎగుమతులు నిలిపివేత
అలా 25 లక్షల రూపాయల విలువ చేసే చేపలను నిర్ధాక్షిణ్యంగా, వృధాగా పారబోయించారని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి నుంచి ఇక్కడి చేపల విక్రయాలు, ఎగుమతులను నిలిపేశారట. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడి మత్స్యసంపద కొనుగోలు చేయడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారం సంఘం...ప్రతినిథుల ఆవేదన
మత్స్యకార, బోటు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నా శ్రీనివాసరావు, ప్రతినిధి హరనాథ్బాబు మాట్లాడుతూ కండవాయి చేపల నుంచి సహజంగానే నీరు కారుతుందని, బురదతో కూడిన ద్రవం వస్తుందని అన్నారు. నిజాంపట్నం నుంచి రూ.25 లక్షల విలువ చేసే కండవాయి, ఇతర చేపల లోడుతో వెళ్లిన వాహనాన్ని ఎర్నాకులంలో అధికారులు తనిఖీ చేశారని వివరించారు. వాహనం నుంచి నీరు కారుతుండటంతో ఒక పెట్టెలో చేపలను చూసి ఎలాంటి విచారణ లేకుండానే అక్కడి అధికారులు డంపింగ్యార్డుకు తరలించారని పేర్కొన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో అక్కడి వ్యాపారులు సరకులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అటు అలా...ఇటు ఇలా...
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యే చేపల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఫార్మాలిన్ రసాయనం ఎక్కువ మోతాదులో ఉందంటూ కర్ణాటక, నాగాలాండ్, అసోం, కేరళ మన రాష్ట్రం నుంచి చేపలను దిగుమతి చేసుకోవడం నిలిపివేయగా తాజాగా కేరల మరో కారణాన్ని సాకుగా చూపి అసలు రాష్ట్రం నుంచి పూర్తిగా చేపలు ఎగుమతులు నిలిపివేసింది. అయితే మిగతా రాష్ట్రాల్లో కేరళ మత్స్యసంపద కొనుగోళ్లు తగ్గిపోవడంతో ఆ చేపలు అమ్మకాలు సొంత రాష్ట్రంలోనే సాగించేందుకు వీలుగా ఆంధ్రా చేపల ఎగుమతులను నిలిపివేసినట్లు మత్స్యకారులు భావిస్తున్నారు. ఎపి ప్రభుత్వం ఈ విషయమై వెంటనే జోక్యం చేసుకొని కేరల నిషేధం సడలించుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.