అనుమతులు లేని స్కూళ్ళేనా .. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులు సీజ్ చేస్తాం అంటున్న మంత్రి పేర్ని నానీ
ఏపీలో జగన్ మార్కు పాలన కొనసాగుతుంది. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టిన వైసిపి దూకుడు చూపిస్తుంది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పారదర్శక పాలనను అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్ బాటలోనే మంత్రులు సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ శాఖల ప్రక్షాళనకు నడుం బిగించారు.
రంగంలోకి దిగిన మంత్రులు .. అనుమతులు లేని స్కూళ్ళు, కళాశాలలపై కొరడా ఝళిపిస్తున్న విద్యాశాఖ
నిన్నటికి నిన్న అనుమతులు లేని స్కూళ్ళు, కళాశాలలపై కొరడా ఝళిపిస్తామని ప్రకటించి విజయవాడలోని సత్యనారాయణపురంలో గల నారాయణ స్కూల్ ను సీజ్ చేశారు అధికారులు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని స్కూల్ ను సీజ్ చేసి లక్ష జరిమానా విధించారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన విద్యా శాఖ మంత్రి సీఎం జగన్ ఆదేశాల మేరకు విద్యాశాఖలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా అనుమతులు లేని స్కూళ్ళు, కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రైవేటు కళాశాలల్లో, స్కూల్స్ లో ఉన్న ఫీజులను నియంత్రించడానికి ఫీ రెగ్యులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఫిట్నెస్ లేని స్కూలు బస్సులపై చర్యలకు రంగం సిద్ధం అంటున్న మంత్రి పేర్ని నానీ
ఇదిలా ఉంటే అనుమతులు లేని స్కూళ్ళు, కళాశాలలే కాదు. ఫిట్నెస్ లేని స్కూలు బస్సులపై కూడా కొరడా ఝళిపిస్తున్నామని ప్రకటించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. ఫిట్నెస్ లేకుండా విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులను నడిపితే సీజ్ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఫిట్నెస్ లేని బస్సులను నడిపే స్కూల్ యాజమాన్యాలు తమ పార్టీకి సంబంధించినవే అయినా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల సమాచారాన్ని తమకు తెలిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్ని నాని ప్రకటించారు .స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేయించుకోవడానికి ఈరోజు సాయంత్రం వరకు డెడ్ లైన్ ఉందని , రేపటి నుంచి ఫిట్నెస్ లేకుండా బస్సు రోడ్డు మీదికి రావడానికి వీల్లేదని మంత్రి పేర్నినాని హెచ్చరించారు .
జగన్ తో పాటు పని మొదలు పెట్టిన మంత్రులు
ఇక పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో అటు విద్యాశాఖ, ఇటు రవాణా శాఖ సంయుక్తంగా నియమ నిబంధనలు పాటించని పాఠశాలలు, కళాశాలల పై ఉక్కుపాదం మోపనున్నాయి. మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు సైతం తమ తమ శాఖల పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక ఏపీలో పాలన ఇలాగే ఉంటే బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, ఇక ఇదంతా ఆరంభశూరత్వం అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రే కాదు మంత్రులు సైతం పని మొదలెట్టేసారు.