అక్టోబర్లో ఏపీ అసెంబ్లీ భేటీ- ఐదు రోజుల పాటు- ఎల్లుండి కేబినెట్లో నిర్ణయం..
ఏపీలో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు వచ్చే నెలలో అసెంబ్లీ సమవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రం కరోనా ప్రభావం కాస్త తగ్గడం, కీలక బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏపీలో వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తున్న అసెంబ్లీ సమావేశాలపై అక్టోబర్ 1న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు తాజాగా జారీ చేసిన కొన్ని సవరణ ఆర్డినెన్స్లను సభలో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రుల అభిప్రాయం కూడా తీసుకుని కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తోంది. కేసుల సంఖ్య ఐదువేలకు సమీపంలోనే ఉంది. దీంతో మంత్రులు, ప్రజాప్రతినిధుల రాకపోకలు పెరిగాయి. తాజాగా పార్లమెంటు సమావేశాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకువి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖకు తరలింపుల విషయంలోనూ అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.