విశాఖలో విషాదం: ఖరీదైన మద్యాన్ని కొనలేక: పార్టీలో కిక్కు కోసం స్పిరిట్: అయిదుమంది మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మద్యాన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని అయిదుమంది స్నేహితులు కిక్కు కోసం స్పిరిట్ను సేవించారు. మృత్యువాత పడ్డారు. సర్జికల్ అవసరాల కోసం వినియోగించే స్పిరిట్ అది. అందులో తక్కువ పరిమాణంలో అల్కహాల్ మిశ్రమం ఉంటుంది. చీప్ లిక్కర్ రేటు కూడా భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మద్యానికి అలవాటు పడిన ఆ అయిదుమంది స్నేహితులు కిక్కు కోసం స్పిరిట్ను సేవించినట్లు పోలీసులు వెల్లడించారు.
పొంచివున్న ఉష్ణమండల తుఫాన్: 120 సంవత్సరాలకు ఒకసారి: 3 రాష్ట్రాలపై విరుచుకుపడటానికి
విశాఖపట్నం జిల్లా కశీంకోట గ్రామంలోని కస్పా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను కూనిశెట్టి ఆనంద్, అప్పారావు, దొరబాబు, వడ్లమూరి మాణిక్యం, నూకరాజుగా గుర్తించారు. వారిలో ఆనంద్ పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో దినసరి వేతన కూలీగా పనిచేస్తున్నాడు. కశింకోటలో నివసిస్తున్నాడు. రాత్రి వారందరూ మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం మద్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. చీప్ లిక్కర్ సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలు అందుబాటులో లేకుండాపోయాయి.
దీనితో ఆనంద్ ద్వారా ఫార్మా కంపెనీలో తయారయ్యే సర్జికల్ స్పిరిట్ను తెప్పించుకున్నారు. సుమారు రెండు లీటర్ల స్పిరిట్ను వారు కొనుగోలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం వారంతా కశింకోటలోని ఆనంద్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ..కిక్కు కోసం సర్జికల్ స్పిరిట్ను సేవించారు. మరుసటి రోజు వారంతా అనారోగ్యానికి గురయ్యారు. స్పిరిట్ ప్రభావానికి లోనయ్యారు.
ఆనంద్ అతని ఇంట్లో మరణించాడు. అతను అవివాహితుడు. కశీంకోటలో ఒంటరిగా నివసిస్తున్నాడు. స్పిరిట్ సేవించడం వల్ల అతను చనిపోయినట్లు తేలడంతో మిగిలిన నలుగురు ఉలిక్కిపడ్డారు. అప్పటికే స్పిరిట్ ప్రభావం అప్పారావు, నూకరాజు అపస్మారక స్థితికి చేరుకున్నారు. అప్పారావు పరిస్థితి విషమించడంతో ఆయనను విశాఖపట్నంలోని కింగ్జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. నూకరాజును కుటుంబ సభ్యులు తొలుత అనకాపల్లి ఆసుపత్రిలో చేర్చారు.
అతని పరిస్థితి విషమించడంతో కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మాణిక్యం, దొరబాబు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయారు. మందుపార్టీలో పాల్గొని స్పిరిట్ సేవించిన అయిదుమందీ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. కిక్కు ఎక్కువగా ఇస్తుందనే ఉద్దేశంతో సర్జికల్ స్పిరిట్ను అతిగా సేవించి ఉంటారని, ఆనంద్ ఇంట్లో స్పిరిట్ క్యాన్ లభించినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.