గుంటూరుజిల్లాలో సైకో దాడి...ముగ్గురికి తీవ్రగాయాలు
గుంటూరు: ఓ మసీదుపై సైకో దాడి చేసిన ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడగా వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమప్తమై సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం మేరకు...రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన షేక్ జానీ పాషాకు గత కొంత కాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో పాషా తండ్రి అతడిని గుంటూరు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం గుంటూరు నుంచి పాషాను అతడి తండ్రి వెంటబెట్టుకొని గ్రామానికి తిరిగి తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో అతడు తండ్రిపై దాడి చేసి తప్పించుకొని పారిపోయాడు.
ఆ తరువాత మాచర్ల చేరుకున్న అతడు పట్టణంలోని మసీదులోకి చొరబడి అక్కడ నమాజు చేసుకుంటున్న వారిపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడి గమనించిన తోటి ముస్లింలు వెంటే సైకో పాషాను పట్టుకొని దేహశుద్ధి చేసి ఆ తరువాత పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు.
సైకో దాడిలో గాయపడిన ఐదుగురులో బాగా దెబ్బలు తగిలిన ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేకనే అతడు దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.