జీపు టైర్ పేలి హుబ్లీలో 5గురు ఏపీవాసులు మృతి, గోల్డ్ చోరీలో ఇంటి దొంగల అరెస్ట్
హైదరాబాద్/కర్నూలు: కర్నాటకలోని హుబ్లీలో మంగళవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారని తెలుస్తోంది. కర్నూలు నుండి గోవా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం హుబ్లీ రైల్వే గేటు వద్ద జరిగింది. జీపు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన వారు.. హుసేన్, సుభాన్, ఇస్మాయిల్, అమీర్, చలపతిలుగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు సోమవారం నాడు ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి శంషాబాదుకు తెల్లవారుజామున ఎమిరేట్ విమానంలో వస్తున్న ఓ స్మగ్లర్ను అనుమానంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి సూటుకేసు ఎనిమిది కిలోల బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2.05 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అతడు నేరం అంగీకరించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సొంతిటి వారి సహకారం అని తేలింది.
ఈ నేపథ్యంలో ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారం స్మగ్లింగ్కు సహకరిస్తున్న ఇద్దరు ఉద్యోగులు రామ్నాయుడు, భాస్కర్రెడ్డిలను జీఎంఆర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు.