చంద్రబాబుకు గట్టి షాక్.. టీడీపీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీల డుమ్మా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శాసనమండలి రద్దుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆదివారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు డుమ్మా కొట్టారు. గైర్హాజరైనవారిలో ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. వీరిలో శత్రుచర్ల,శమంతకమణి మండలిలో రూల్.71పై ఓటింగ్కి కూడా దూరంగానే ఉన్నారు.
ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు చంద్రబాబుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ వర్గాలు మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. విదేశాల్లో ఉన్నందున సమావేశానికి రాలేకపోతున్నానని రామకృష్ణ,ఆరోగ్య కారణాలతో శత్రుచర్ల,పెళ్లి పనుల కారణంగా తిప్పేస్వామి,వ్యక్తిగత కారణాలతో గాలి సరస్వతి,కేఈ ప్రభాకర్ సమావేశానికి రాలేకోతున్నామని సమాచారం అందించారని చెబుతున్నారు. ఏదేమైనా కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హారవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా,ప్రస్తుతం మండలిలో టీడీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో పోతుల సునీత,శివనాథరెడ్డి మండలిలో రూల్.71పై ఓటింగ్ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అప్పటినుంచి వారు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పోతుల సునీత సీఎం జగన్ను కూడా కలవడంతో.. ఆమె వైసీపీలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.