అతి వేగం..నిద్రమత్తు! ఓ కుటుంబాన్ని చిదిమేసింది!
తిరుపతి: అతి వేగం, నిద్రమత్తు కొన్ని కుటుంబాలను చిదిమేసింది. చితికి చేర్చింది. ప్రమాదమని తెలిసినప్పటికీ..కారును వేగంగా నడిపించడం వల్ల ఏర్పడిన దుష్పరిణామం ఇది. శుక్రవారం తెల్లవారు జామున చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో అయిదుమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన వారు. వారంతా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం తిరుమలకు వెళ్తుండగా.. ఈ దుర్ఘటన సంభవించింది.
గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన సత్యనారాయణ మూర్తి తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. దీనికోసం ఓ కారును అద్దెకు కుదుర్చుకున్నారు. శుక్రవారం తెల్లవారు జాముకంతా తిరుమలకు చేరుకోవాలనేది వారి ప్రణాళిక. అచ్చంపేట నుంచి బయలుదేరిన కారు తెల్లవారు జామున 4 గంటల సమయానికి శ్రీకాళహస్తి-రేణిగుంట మార్గంపైకి చేరుకుంది. మరో గంటలో వారు తిరుపతికి చేరుకుంటారనగా కారు ప్రమాదానికి గురైంది.
నెల్లూరు-పూతలపట్టు జాతీయ రహదారిపై దురువరాజు పల్లి వద్ద మలుపులో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వెనుక వైపు నుంచి అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ మూర్తి, ఆయన భార్య విజయలక్ష్మి, ప్రసన్న, చెన్నకేశవరెడ్డి, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో అయిదుమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తీవ్రత ధాటికి కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనను చూసిన వెంటనే స్థానికులు రేణిగుంట టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని డ్రైవర్ గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారి కావడం, పైగా మలుపులో లారీని నిలిపి ఉంచడం ప్రమాదానికి దారి తీసినట్లు చెబుతున్నారు.