నాగార్జునలో ర్యాగింగ్: అమ్మాయిలకు ఐదుగురి వేధింపు, షాకిచ్చిన వీసీ, గంటా సీరియస్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో బీఆర్క్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు... మొదటి సంవత్సరంలో ప్రవేశించిన ఇద్దరు విద్య్రార్థినీలను హాస్టల్లో వేధించారు.
అధికారులకు ఫిర్యాదులు చేరాయి. ఈ ఐదుగురు విద్యార్థులను కాలేజీ నుంచి పదిహేను రోజులప పాటు సస్పెండ్ చేసి, శాశ్వతంగా వసతి గృహం నుంచి తొలగిస్తూ షాకిచ్చారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగిందని తెలుస్తోంది.
నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ భూతానికి కొద్ది నెలల క్రితం బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చదువు కోసం వరంగల్ నుంచి గుంటూరు దాకా వచ్చిన ఆ చదువుల తల్లి బలవన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
ఈ ఘటన నేపథ్యంలో వర్సిటీ అధికారులతో పాటు ఏపీ సర్కారు నిందితులపై కొరడా ఝుళిపించింది. అయినా ర్యాగింగ్ ఆగడం లేదు. అందుకు, తాజాగా ఇద్దరు జూనియర్లను ఐదుగురు సీనియర్లు వేధింపులకు గురి చేయడమే నిదర్శనం. ఈ ఘటన వెలుగుచూడటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
తాజా ఘటనపై వేగంగా స్పందించిన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లు ముగ్గురు విద్యార్థులు వినితేశ్వర్, మంజునాథ్, శ్వేతలను డిబార్ చేయడంతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు వర్సిటీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ర్యాగింగ్ పైన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.