దారుణం... శ్మశాన వాటికలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి...
కాకినాడలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో చిన్నారిని శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అత్యాచారం తర్వాత బాలికను ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి ఎత్తుకెళ్లి...
పోలీసుల కథనం ప్రకారం... కాకినాడకు చెందిన ఓ వివాహిత కుటుంబం స్థానికంగా ఓ కాలనీలో నివాసం ఉంటోంది. ఉపాధి నిమిత్తం ఆ వివాహిత హైదరాబాద్ వెళ్లగా... ఐదేళ్ల ఆమె కుమార్తె అమ్మమ్మ,తాతయ్య,తండ్రితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఓ కామాంధుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. అర్ధరాత్రి అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న సమయంలో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. చిన్నారి ఏడుపు అందుకోగా ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు.
శ్మశాన వాటికలో
సమీపంలోని ఓ శ్మశాన వాటికి వద్దకు తీసుకెళ్లి చిన్నారిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. ఒంటిపై దుస్తులు లేకుండా.. తీవ్ర గాయాలతో రోధిస్తున్న ఆ చిన్నారిని స్థానిక వ్యక్తి ఒకరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే చిన్నారిని కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే మెడికో లీగల్ కేసు(ఎంఎల్సీ) తీసుకొస్తేనే బాలికకు వైద్యం చేస్తామంటూ అక్కడి వైద్యులు ఆలస్యం చేశారని బాధిత బాలిక తండ్రి వాపోయారు.
Recommended Video
వైద్యుల వివరణ...
పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రామ్మోహన్ చొరవతోనే జీజీహెచ్ వైద్యులు బాలికకు వైద్య చికిత్స అందిస్తున్నారని ఆమె తండ్రి తెలిపారు. వైద్య చికిత్సలో జాప్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను పోలీసులు వివరణ కోరగా... బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో అనస్థీషియా డాక్టర్ వేరే శస్త్ర చికిత్సలో ఉన్నట్లు చెప్పారు. అందుకే కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని... నిందితుడిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.