వైసీపీ ఎంపీల రాజీనామా, స్పీకర్ సూచన: సభలోనే టీడీపీ ఎంపీలు, జగన్ సవాల్
Recommended Video
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్కు సమర్పించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వారు రాజీనామాలు ఇచ్చారు.
రాజీనామాలపై పునరాలోచన చేయాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. సభలోనే ఉండి పోరాటం చేయాలని సూచించారు. అయితే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు స్పీకర్ను కోరారు. రాజీనామా అనంతరం వారు ఏపీ భవన్ వెళ్లి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలోనే కూర్చున్నారు. సభ వాయిదా పడినప్పటికీ వారు లోపలే కూర్చొని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. వారు రెండు రోజులుగా ఇలా నిరసన తెలుపుతున్నారు.
టీడీపీకి జగన్ సవాల్
ఇచ్చిన హామీ ప్రకారం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎంపీలకు దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని సూచించారు. అలాగే, తమతో కలిసి రానందున రెండో అఖిల పక్షానికి హాజరు కావొద్దని వైసీపీ నిర్ణయించింది.