పక్షుల పండుగ 2018...ప్రముఖుల సందడి...వెరసి కన్నులవిందు...ఎక్కడంటే...
సుళ్లూరుపేట: నెల్లూరు జిల్లాలో విదేశీ విహంగాల విడిది కేంద్రాలకు పండుగ కళ వచ్చేసింది...పక్షుల పండుగ సందర్భంగా తరలివచ్చే సందర్శకులకు పులికాట్ సరస్సు, నేలపట్టులో విహంగాల కిలకిల రావాలు, తెరచాప పడవల అందాలు కన్నులవిందు చెయ్యనున్నాయి.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో జనవరి 7,8,9 తేదీల్లో ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు భూమా అఖిలప్రియ, పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిద్దా రాఘవరావు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ పక్షుల పండుగ కోసం తరలివచ్చే పర్యాటకుల కోసం అధికారులు బివిపాళెం పడవల రేవు వద్ద ఉచితంగా బోటు షికారు చేసేందుకు, పులికాట్ను సందర్శించేందుకు ప్రత్యేక ఉచిత బస్సులతో పాటు తాగునీటి సౌకర్యం అన్ని వసతులు కల్పించారు. సాయంవేళల్లో సినీ తారలచే పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
పక్షుల పండుగ...ఎందుకంటే...
నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు దగ్గరలోని నేలపట్టు దగ్గర ఉన్న పులికాట్ సరస్సు దేశంలో ఉన్న పెద్ద సరస్సులలో రెండవది. సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడకి ఎన్నో రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, నైబీరియా తదితర దేశాల నుంచి శీతాకాలంలో ఆహారం కోసం వలస వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తరువాత వాటితోకలిసి ఎగిరిపోతాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం గూడ బాతుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి గాచింది. అరుదైన నత్తగుల్ల కొంగ, నీటికాకి, తెల్లకంకాణాయి, శబరి కొంగ, ఎర్రకాళ్లకొంగ, పెలికాన్, సముద్రపు రామచిలుక(ఫ్లెమింగో), నారాయణ పక్షి, గార్గవి తదితర 117 రకాల పక్షులు ఇక్కడి వస్తాయి.
ప్రతి ఏటా...ఆనవాయితీ...
ఎంతో ప్రాధాన్యత గల ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి నెలలో పక్షుల పండుగ పేరుతో ప్రముఖులను ఆహ్వానించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సూళ్లూరుపేట జూనియర్ కళాశాల కేంద్రంగా ఈ పక్షుల పండుగను నిర్వహింపచేస్తున్నారు. దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, తడ మండలం భీములవారిపాళెం పడవలరేవు, షార్రోడ్డులోని అటకానితిప్ప వద్ద ఉన్న పులికాట్ పర్యావరణ విజ్ఞానకేంద్రాలలో పక్షుల పండుగను నిర్వహింపచేస్తున్నారు. సందర్శకులను తరలించేందుకు సూళ్లూరుపేట నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఈ పక్షుల పండుగ సందర్భంగా విదేశీ పర్యాటకులు కూడా విచ్చేస్తుండటం గమనార్హం.
పండుగే పండుగ...సందడే సందడి...
ఆదివారం నుండి మూడు రోజులపాటు జరిగే ఈ పక్షుల పండుగకోసం పట్టణమంతా విద్యుత్ దీపాలంకరణలతో అలంకరింపచేశారు. పట్టణ ముఖద్వారమైన హోలిక్రాస్ సెంటర్లో షార్ సర్కిల్లో ఏర్పాటు చేసి న రంగురంగుల విద్యుత్దీపాలు సందర్శకుల కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. ఆహారం అందించేందుకు ఓ 23 స్టాళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సందర్శకుల కోసం రంగులరాట్నాలు, జెయింట్వీల్లు సిద్ధం చేశారు. సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ఆవరణలో పండుగ జరిగే మూడు రోజులు విబ్రి మీడియా ఆధ్వర్యంలో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు సినీ బుల్లితెర నటులు, యాంకర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భారీ బందోబస్తు...
ఈ ఫ్లెమింగో ఫెస్టివల్-2018 పక్షుల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. గూడూరు డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 30 మంది హెడ్కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియమించారు. పట్టణంలోని జూ నియర్ కళాశాల ఆవరణలోనూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టి జేబుదొంగతనాలు, మహిళల మెడల్లో ఆభరణాల చోరీలతోపాటు ఆకతాయిల అల్లరిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
నిర్వహణపై విమర్శలు...
ఈ పక్షుల పండుగ ప్రతిసారి నాయకుల రాజకీయ బలం చూపించేందుకు, విమర్శలు చేసుకోవడానికి తప్పితే మరే ప్రయోజనం ఉండటం విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేస్తున్నామంటూ రాజకీయ ప్రచారార్భాటాలు ఎక్కువవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో పక్షుల పండుగకు కేటాయించిన నిధులు ఎక్కువుగా ఖర్చచేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదంటున్నారు విమర్శకులు. గతంలో కూడా తమన్నా, శ్రీయ, ఛార్మి వంటి హీరోయిన్ లు ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో సూళ్లూరుపేట వచ్చి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలలో యువతను హుషారెత్తించేందుకే పరిమితమయ్యారు తప్పించి ఆ సెలబ్రిటీలను పక్షుల రక్షిత కేంద్రంలోకి తీసుకెళ్లి పక్షులను, ప్రకృతిని రక్షిస్తే కలిగే లాభాల గురించి తెలిపే అవగాహనా కార్యక్రమాల ఏర్పాటు చేసిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు.