Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన దిశ చట్టం..!
అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత అరుదైన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. 21 రోజుల్లో అత్యాచార నిందితుడిని ఉరికంబం ఎక్కించడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా అరుదైన గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్.
దిశ హత్యోదంతంతో పురుడుపోసుకున్న చట్టం..
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం..ఈ చట్టం ఆవిర్భావనికి కేంద్రబిందువైంది. వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం.. ఈ చట్టం పురుడు పోసుకోవడానికి కారణమైంది. శాంతిభద్రతలు, అమ్మాయిల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో యావత్ దేశానికే దిశా నిర్దేశం చేసేలా రూపుదాల్చింది.
మహిళలు, విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు..
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష విధించేలా రూపొందించిన ఏపీ దిశ చట్టానికి శాసనసభ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం శాసనసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు సభ్యులు. దీనితో ఇది చట్టంగా రూపాంతరం చెందింది. బిల్లుపై శాసనసభ ఆమోదించిన వెంటనే- మహిళలు, విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మూడు వారాల్లో ఉరికంబం..
అత్యాచారానికి పాల్పడిన తొలి ఏడు రోజుల్లోనే నిందితుల నేరాన్ని నిరూపించడానికి అవసరమైన ప్రాధమిక ఆధారాలను పోలీసు యంత్రాంగం సేకరించాల్సి ఉంటుంది. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. దీనికి అవసరమైన సహాయ, సహకారాలను హోం మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఈ చట్టం కింద 21 రోజుల్లోనే విచారణ ముగించి, ఉరిశిక్షను అమలు చేస్తారు.
పకడ్బందీగా అమలు..
ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కొద్దిరోజుల కిందటే ఆయన హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టారు. అత్యాచార కేసులను యుద్ధ ప్రాతిపదికన విచారించడంతో.. పాటు బాధిత కుటుంబానికి సత్వర న్యాయాన్ని అందజేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
పలు రాష్ట్రాలు ఆసక్తి..
ఏపీ దిశ చట్టాన్ని అమలు చేయడానికి పలు రాష్ట్రాలు ఆసక్తి చూపడం.. దీనికి ఉన్న ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. ఒడిశా, కేరళ, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు దిశ చట్టంపై అత్యంత ఆసక్తిని ప్రదర్శించాయి. వాటి ప్రతులను తెప్పించుకున్నాయి. ఈ చట్టంపై అధ్యయనం చేస్తున్నాయి. అన్నీ కొలిక్కి వస్తే.. యథాతధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం దీనిపై ఆరా తీసింది. పోస్కో, నిర్భయ కంటే ఈ చట్టం అత్యంత బలంగా ఉందని కేంద్రం విశ్వసిస్తోంది.