చంద్రబాబు.. పవన్ కాళ్లు మొక్కిన ఫలం కాదా? చెంపలు పగుల్తాయ్: టీడీపీకి జనసేన లీడర్
విజయవాడ: విజయవాడలో ఫ్లెక్సీ రాజకీయం వేడిని రాజేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విజయవాడలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.
కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పోటీగా జనసేన నాయకుడు మండలి రాజేష్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. 2009లో టీడీపీ పరిస్థితి ఏమిటి, 2014లో అధికారంలో లేని కారణం ఏమిటో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు ఆలోచించుకోవాలని ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
'పవన్! మీకంత సీన్ లేదు, మీ అన్నదమ్ములు కలిసినా ఏంచేయలేదు, బాబును గెలిపించారా?'
మీ రెండు చెంపలు పగిలిపోతాయ్
కాట్రగడ్డ ప్రసాద్ ఫ్లెక్సీకి కౌంటర్గా మండలి రాజేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో.. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి ఇది 2009 కాదని మీకు ముందే చెప్పామని, ఒక చెంప మీద కొట్టేలోపు మీ రెండు చెంపలు పగిలిపోతాయి జాగ్రత్త... అని హెచ్చరిస్తూ, తమ్ముళ్లూ దీపావళి శుభాకాంక్షలు అని గ్రీటింగ్స్ కూడా తెలిపారు.
బాబు తంత్రమా, పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కినందుకా?
పిచ్చి ముదిరిందని, అందుకే పిచ్చి పురాణమని, ఏం తమ్ముళ్లూ ఓటమి భయం వేధిస్తోందా, దశాబ్దాల ప్రతిపక్ష కాలం గుర్తుకు ఉందా, 2009లో బెజవాడ గడ్డ మీద మీరు జీరో అని, 2014లో ఎలా హీరో అయ్యారో గుర్తుంచుకోవాలని, మీరు అధికారంలోకి రావడం మీ నాయకుడి (చంద్రబాబు) తంత్ర ఫలితమా లేక మా నాయకుడి (పవన్ కళ్యాణ్) కాళ్లు మొక్కిన ఫలితమా అని గుర్తుకు తెచ్చుకోండని చెప్పారు.
ఈ గతి పట్టించకుంటే మేం జన సైనికులమే కాదు
2019లో ఓడిపోతామనే భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకుందని, అందుకే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పచ్చ పేపర్కు ఎక్కువ, సింగిల్ డిపాజిట్కు తక్కువ, 2019లో ఈ గతి పట్టించకుంటే మేం జన సైనికులమే కాదని పేర్కొన్నారు.
ఖబడ్దార్ తమ్ముళ్లూ!
చివరలో ఖబడ్దార్.. తెలుగు తమ్ముళ్లూ.. గోదావరిలో మొదలైంది మీకు కౌంట్ డౌన్ అంటూ మండలి రాజేష్ పేరు పైన ఈ ఫ్లెక్సీ వెలిసింది. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరు మీద విజయవాడలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్వి అహంకారపూరిత మాటలు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. 2009లో అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు కలిసి ప్రచారం చేసి, పోటీ చేస్తే 20 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్కు రెండు సీట్లు వస్తే కూడా చాలా ఎక్కువ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీనికి కౌంటర్గా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.