ఏపీలో ఆగని టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీల రచ్చ .. నిన్న చిత్తూరు , నేడు గుంటూరులో రగడ
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరుతున్నాయి. చిన్న చిన్న గొడవలే చివరకు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఇక పోలీసులు సర్ది చెప్పినా ఇరు వర్గాలు వినని పరిస్థితి నెలకొంటుంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది పరిస్థితి.
ఉండవల్లిలోని బాబు ఇంటి విషయంలో కేసీఆర్ చెప్పిందే నిజమా..? అదే కొంప ముంచిందా..? టీడీపీ నేతల్లో చర్చ
Recommended Video
గుంటూరులో ఫ్లెక్సీల రచ్చ .. వైసీపీ ఫ్లెక్సీ పక్కనే టీడీపీ ఫ్లెక్సీ పెట్టటమే కారణం
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు ఆగటం లేదు. ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడటం ఏపీలో సర్వ సాధారంగా మారింది. నిన్నటికి నిన్న కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతి పురంలో టీడీపీ ఫ్లెక్సీ ల వివాదం చల్లారక ముందే నేడు గుంటూరులో మరోసారి ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లాలో తమ ప్లెక్సీ పక్కనే టీడీపీ నేతలు పోటీగా ప్లెక్సీని కట్టడంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు దాన్ని చించిపడేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది .బాహాబాహీ చోటుచేసుకుంది.
టీడీపీ ఫ్లెక్సీని చించేసిన వైసీపీ శ్రేణులు .. ఇరు వర్గాల మధ్య బాహాబాహీ
గుంటూరు జిల్లాలోని రేపల్లెలో ఇటీవల వైసీపీ నేతల పర్యటన సందర్భంగా రాజ్యలక్ష్మి సెంటర్ లో వైసీపీ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు దీనికి పక్కనే స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేరుతో మరో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో సంయమనం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకుని ఒక్కసారిగా టీడీపీ ప్లెక్సీని చించి కిందపడేశారు. ఇక ఈ విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకోవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ , తోపులాట చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
నిన్న కుప్పంలోనూ ఫ్లెక్సీల రగడ .. మూడు గంటలపాటు జాతీయ రహదారిపై హంగామా
నిన్నటికి నిన్న కుప్పం నియోజకర్గంలోని శాంతిపురంలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతిపురంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ల ఏర్పాటు పైన కూడా పెద్ద రగడ జరిగింది . తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు , ఇంతకు ముందు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఉన్న స్థానంలో కట్టటంతో ప్రారంభమైన ఘర్షణ మూడు గంటల పాటు జాతీయ రహదారి మీద రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి , నిరసనలకు కారణం అయ్యింది. ఇక నేడు గుంటూరులోనూ ఫ్లెక్సీల రచ్చ ఘర్షణకు కారణం అయ్యింది .
శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతంగా మారుతున్న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు .. కట్టడి చెయ్యాల్సింది పార్టీలే
ఇక టీడీపీ , వైసీపీ శ్రేణులు ఈ విధంగా తరచూ బాహాబాహీకి దిగితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పెద్ద సమస్యగా మారే ప్రమాదం వుంది. అటు వైసీపీ అధినాయకత్వం వైసీపీ శ్రేణులకు , ఇటు టీడీపీ అధినాయకత్వం టీడీపీ శ్రేణులకు సంయమనం పాటించాలని , ఘర్షణలకు దిగవద్దని చెప్పకుంటే ముందు ముందు ఈ ఘర్షణలే వారి ప్రాణాలకు హాని కలిగించేదాకా పోతాయని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు . రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ఘర్షణలను, కార్యకర్తల ఆగ్రహావేశాలను కట్టడి చెయ్యకుంటే అది పార్టీలకు నష్టం చేకూర్చే ప్రమాదం వుంది.