ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య వరద రాజకీయం ..వరదలపై కూడా రచ్చేనా !!
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో నిన్నమొన్నటిదాకా వర్షాలు ముంచెత్తాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ సమీప గ్రామాలు ముంపుకు గురయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చాలా లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ముంపుకు గురైన గ్రామాలలో సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపు గ్రామాల ప్రజలకు భరోసా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారా లోకేష్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
70 రోజుల్లోనే 98 మంది రైతుల ఆత్మహత్య ... ఇదేనా జగన్ పాలన అన్న మాజీ మంత్రి
ఏపీ వరదలతో ముంపుకు గురైన గ్రామాలు .. సాయం అందలేదని టీడీపీ , సహాయక చర్యలు జరుగుతున్నాయన్న వైసీపీ
గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం ఎలాంటి తక్షణ సహాయక చర్యలు తీసుకోలేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నారా లోకేష్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే బురద రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు పునరావాసం కల్పించలేదని అటు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పునరావాసం కల్పించాలని, భోజన వసతి కల్పించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల పంపిణీ తో పాటుగా, పునరావాసం కల్పిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందని వైసిపి నేతలు చెప్పుకుంటున్నారు.
లోకేష్ పర్యటనపై విజయసాయి ట్వీట్లు .. పోలవరం ముంపు గ్రామాలలో టీడీపీ నాయకులను అడ్డుకోవాలని విజయసాయి పోస్ట్
ఇక వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి మరో అడుగు ముందుకేసి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫోటోలను కలిపి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు పొడి నేలలో వరినాట్లు వేస్తే, తాజాగా లోకేష్ వరద నీటిలో వరినాట్లు వేస్తున్నాడు అంటూ పబ్లిసిటీ కోసం నానా పాట్లు పడుతున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే వరదల్లో నష్టపోయిన పంటలను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలో నుండి ఆ ఫోటో ఎడిట్ చేసి, ఇంకేదో కలిపి చెప్పి ఇలా దిక్కుమాలిన ట్వీట్లు చేస్తూ ఉంటే ముందు ముందు మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరు అంటూ టిడిపి నేతలు విజయసాయి పోస్ట్ పై మండిపడ్డారు. ఇక ఆ తర్వాత పోలవరం ముంపు గ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శకు వస్తే అడ్డుకోవాలని విజయసాయి రెడ్డి మరో పోస్టు చేశారు. ఎలక్షన్ల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కాపాడడం నిర్మించడం వల్లే ప్రవాహం వెనక్కి అన్ని గ్రామాలు మునిగాయని ఆయన ఆరోపణలు చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు టిడిపి నాయకుల అడుగుపెట్టనివ్వొద్దు అంటూ మరో షాకింగ్ ట్వీట్ చేసారు విజయ్ సాయి రెడ్డి. ప్రస్తుతం టిడిపి నాయకులు ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
వరదనీటిలోనే జలదీక్ష చేసిన నిమ్మల .. బాధితులకు పునరావాసం , భోజన వసతి కోసం వరదలో ఆందోళన
ఇక మరోవైపు 11 లంక గ్రామాల ప్రజలకు, నక్కల కాలువ పరివాహక ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, నిత్యావసరాల అందజేయడంతో పాటు గా, వారికి భోజన వసతి కల్పించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దొడ్డిపట్ల పల్లెపాలెం లో నిరసన దీక్ష చేశారు. వరదనీటిలోనే కూర్చుని బాధితులతో కలిసి దీక్ష చేపట్టిన ఆయన బాధితులను ఆదుకునేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఉదయం 10 గంటలకు ప్రారంభించిన దీక్షను రాత్రి 9 గంటల వరకు కొనసాగించారు. ఇక చివరకు బాధితులకు న్యాయం చేస్తామని ఆర్టీవో హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. ఇక ఇలా రాజకీయ నాయకులు పొలిటికల్ స్టంట్స్ తో ముంపు గ్రామాల ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితో కావలసిన సహాయాన్ని మాత్రం అందించటం లేదనేది ప్రజల అభిప్రాయం. వరదముంపు గ్రామాల ప్రజలు వరదలతో పడుతున్న ఇబ్బందులను కూడా రాజకీయం చేస్తారా? వరదలపై కూడా ఇంత రచ్చనా అని రాజకీయ పార్టీల వైఖరితో తెగ బాధ పడుతున్నారట.