ఏపీకి వరద హెచ్చరిక, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఆంధ్రప్రదేశ్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. పోలవరం ధవళేశ్వరం బ్యారేజీల వద్ద నీటి ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పొంగిపొర్లుతోంది. భారీ వర్షాలతో ఏపీలో పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు తెలంగాణలోని భద్రాచలంలో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. కూనవరంలో నీటిమట్టం స్థిరంగా ఉండగా పోలవరం, ధవళేశ్వంరలలో విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో 167మంది రెస్క్యూ సిబ్బందిని ఏర్పాటు చేసింది. రెండు బృందాలు వీరవరం, ఒక బృందం చింతూరు, మరో బృందం రాజమండ్రిలో సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ వరద పోటెత్తితే వీరి దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయని, సంస్థ తెలిపింది.లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రెస్క్యూ సామగ్రిని అందజేశామని అధికారులు తెలిపారు. వీరికి అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 30మంది రంపచోడవరంలో ఉండగా అగ్నిమాపకశాఖకు చెందిన మరో 90 మందిని స్టాండ్బైగా ఉంచారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గతనెల ఆగష్టులో భరీ వర్షాలు కురిశాయి.దీంతో ఉభయగోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టుప్రాంతాల్లో నివాసముంటున్న 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పిల్వే నిర్మాణం చేపట్టకుండా కాఫర్డ్యాం నిర్మించి దాని ఎత్తును పెంచడంతోనే వరదలు ముంచెత్తాయని వైసీపీ ప్రభుత్వం విమర్శించింది.