శ్రావణంలో పూల తడాఖా .. కనకాంబరాలు .. రెండు వేలే .. డెడ్ చీప్ అంట
Recommended Video
ఇప్పుడు పువ్వులు కూడా తమ తడాఖా చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పువ్వులు కూడా సామాన్యులను వెక్కిరిస్తున్నాయి. కనకాంబరాలు కొనలేరు పొమ్మంటున్నాయి.. చామంతులు మీ వల్ల కాదంటూ చిన్నచూపు చూస్తున్నాయి. గులాబీలు గుచ్చుకుంటున్నాయి.. కలువ పూలు కస్సుబుస్సుమంటున్నాయి. బంతిపూలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. మల్లెలు మరిచిపో మంటున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ .. సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో కళకళలాడుతున్న ఆలయాలు
డిమాండ్ ను బట్టి ధరలు .. శ్రావణంలో పూల ధరలకు రెక్కలు
అసలే శ్రావణమాసం, అందులోనూ వరలక్ష్మీ వ్రతం మరి ఇంకేం చుక్కలనంటిన పువ్వుల ధరలతో సామాన్యులకు నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి.
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళల హడావిడి అంతా ఇంతా కాదు. ఇక మహిళా లోకం శ్రావణ మాసం లో నిర్వహించే పూజాపునస్కారాలు చూసి డిమాండ్ ను బట్టి ధరలు పెంచేస్తున్నారు పూలు పండ్ల వ్యాపారులు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూల ధరలు ఆకాశాన్ని తాకాయి. కొనలేకున్నా కొనక తప్పని పరిస్థితి కాబట్టి వ్యాపారులు మాత్రం ధరల విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు .
కొండెక్కి కూర్చున్న కనకాంబరాలు .. సామాన్యులు కొనలేరు పొమ్మంటున్న పూలు
శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన ధరలకు , వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రెక్కలొచ్చాయి . పూల మార్కెట్ లో వ్యాపారులు చెబుతున్న ధరలను చూస్తే షాప్ తినే పరిస్థితి. 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చిన్న బుట్టలోకి కూడా పూలు రాని పరిస్థితి. అయినప్పటికీ తప్పని సరి కావడంతో పూల ధరలు షాక్ కొడుతున్నా కొనుగోలు చేయక తప్పడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లో కనకాంబరం పూలు కిలో రూ. 2 వేలకు చేరుకుంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేజీ చామంతులు ఆరు వందలు. మూర మల్లెపూలు 150 కి తక్కువ లేదు. ఒక్క కలువపువ్వు 100. గులాబీలు కిలో రూ. 500 వరకూ పలుకుతుండగా, బంతిపూల ధర కిలోకు రూ. 80 పలికింది. ఇది హైదరాబాద్ పూల మార్కెట్ లోని తాజా ధరలు.
పూల ధరలపై అసంతృప్తి.. అయినా కొనుగోలు చెయ్యక తప్పని స్థితి
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓ రేంజ్ లో ధరలు పెంచి అమ్ముతున్నా , మహిళలు ధరలు చూసి నూరేళ్ల బెడుతున్నా , అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా ధరలు మాత్రం ఫిక్స్ అంటూ తేల్చి చెబుతున్నారు దుకాణందారులు. ఇక అధిక ధరలు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తమకు అవసరమైన మేరకు పూలను కొనుగోలు చేసి వెళుతున్నారు.
సాధారణ రోజుల ధరలతో పోల్చి చూస్తే పండుగ సమయాల్లో పూల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మామూలు రోజుల్లో ధరలకు , శ్రావణ మాసంలో ధరలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. పది రూపాయల ధర పలకని పూలకు శ్రావణంలో వందల డిమాండ్ వస్తోంది. మొత్తానికి పూల షాపుల వంక చూడాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నడిపించే మధ్యతరగతి కుటుంబాలకు వరలక్ష్మీ వ్రతం వంటి పండుగలు జరుపుకోవాలన్నా మండుతున్న ధరలతో ఇబ్బందికరంగానే ఉంటుంది.