'బిజెపితో టచ్లో నేతలు, ఏపీపై మోడీ దృష్టి': బాబుకు షాకిస్తారా?
ఆంధ్రప్రదేశ్ పైన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక దృష్టి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో అమలు చేసే అవకాశముందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పైన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక దృష్టి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో అమలు చేసే అవకాశముందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు.
జగన్కు వరుస షాక్లు, నేతల ఆందోళన: గుర్నాథ్ రెడ్డి ఝలకిస్తారా?
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. విశాఖలో ఆయన ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఆ తర్వాతే 2019 ఎన్నికలకు వెళ్తాం
రాష్ట్ర విభజన సందర్భంలోనూ, ఆ తర్వాత పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చిన తర్వాతే 2019లో ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల్లో పని చేస్తోన్న పార్టీ ప్రతినిధులతో పాటు, పార్టీలో కార్యదర్శి హోదా కలిగిన 30 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి అయిదేసి నియోజకవర్గాలు అప్పగించారన్నారు.
నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు
ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అధిష్ఠానం ఆదేశాలిచ్చినట్టు మురళీధర రావు తెలిపారు. తనకు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత అప్పగించారన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన బూత్స్థాయి నాయకుల సమావేశానికి స్పందన వచ్చిందన్నారు.
టిడిపి ఉన్నా విస్తరిస్తాం
ఇకపై తరచూ విశాఖలో పర్యటించి పార్టీని బలోపేతానికి కార్యాచరణను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో టిడిపి ఉన్నా, బిజెపి విస్తరణకు కావాల్సినంత అవకాశం ఉందని మురళీధర రావు చెప్పారు. టిడిపితో కలిసి ఉన్నంత మాత్రాన తమ ఎదుగుదలకు అడ్డు కాదన్నారు.
చాలామంది టచ్లో
అనేకమంది నాయకులు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మురళీధర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారంతా తమతో సంప్రదింపులు చేస్తున్నారన్నారు. రైల్వే జోన్, కేంద్ర విద్యాసంస్థలు సహా ప్రధాని మోడీ, ఇతర బిజెపి నాయకులు ఇచ్చిన హామీలను తీరుస్తామన్నారు.
బిజెపితో ఎవరు టచ్లో ఉన్నారు?
తమతో పలువురు నేతలు టచ్లో ఉన్నారని మురళీధర రావు చెప్పిన నేపథ్యంలో ఎవరు టచ్లో ఉన్నారనే చర్చ సాగుతోంది. జగన్ పార్టీ వైసిపి, కాంగ్రెస్ పార్టీలలోని అసంతృప్తులతో పాటు, 2019లో నియోజకవర్గాల పెంపు లేకుంటే తమకు టిక్కెట్ దక్కదని భావించే టిడిపిలోని కొందరు నేతలు కూడా టచ్లో ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే చంద్రబాబుకు షాకే అంటున్నారు.