లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులు
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. నమస్కారం ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నారు అంటూ ఆయన వారితో మాట్లాడారు.
చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ను రాజకీయాల్లో పైకి తీసుకు వచ్చేందుకు ఏపీకి నష్టం చేకూరుస్తున్నారని మోడీ ఆరోపించారు. కొడుకు కోసం (సన్ రైజ్) ఏపీకి సూర్యాస్తమయం వంటి పరిస్థితిని తీసుకు వస్తున్నారని చెప్పారు.
కొడుకు రాజకీయ ఎదుగుదులకు ఏపీని వదిలేశారు
కేవలం కొడుకు రాజకీయ ఎదుగుదల పైనే చంద్రబాబు దృష్టి సారించారని మోడీ ఆరోపించారు. ఇందుకోసం ఏపీలో భారీగా జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పాలసీలను వేటినీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యం కొడుకు రాజకీయ భవిష్యత్తే అన్నారు. తన కొడుకు కోసం ఆలోచిస్తూ.. ఏపీలోని ఇతర పిల్లల గురించి ఆలోచించడం చంద్రబాబు వదిలేశారన్నారు.
ఎన్టీఆర్ను ఒక్కసారి కాదు.. రెండుసార్లు చీట్ చేశారు
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దివంగత ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్నారు. తెలుగుకు అసలైన గర్వకారణం ఎన్టీఆర్ అన్నారు. వీరు (చంద్రబాబు) ఏపీని చీట్ చేయడం ఇదే మొదటిసారి కాదని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ను కేవలం ఒక్కసారి కాదు... రెండుసార్లు చీట్ చేశారని, అలాంటి వారి నుంచి మనం ఏం ఆశించగలమని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ విలువలకు తిలోదకాలు
ఈ రోజు ఏపీలో అధికారంలో ఉన్నవారు (చంద్రబాబు) గతంలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తెలుగు ప్రజలకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా ఉన్నారని చెప్పారు. అధికారం కోసం ఏపీ అభివృద్ధిని తాకట్టు పెడుతున్నారన్నారు. ఎన్టీఆర్ విలువలకు వారు (టీడీపీ) తిలోదకాలు ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్ మార్గదర్శకంలో నడుస్తారని గెలిపిస్తే వారు వాటిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టాలని, ఎన్టీఆర్ విలువలకు సెల్యూట్ అన్నారు.
మీరు తెలుగు గౌరవం నిలబెడతారా?
నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నానని, కేవలం ఒకే కుటుంబం అధికారంలో ఉండటం ద్వారా తెలుగు గౌరవం ఎలా నిలబడుతుందని చంద్రబాబును ఉద్దేశించి మోడీ ప్రశ్నించారు. చంద్రబాబు.. తన తర్వాత లోకేష్ను రాజకీయాల్లో మరింత పైకి తీసుకురావడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం ద్వారా, వారి ఆశలను తుంగలో తొక్కడం ద్వారా తెలుగు గౌరవం ఎలా నిలబడుతుందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. పదేపదే నన్ను (మోడీ) తిట్టడం ద్వారా తెలుగు గౌరవం ఎలా నిలబడుతుందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలమయ్యారని, అలాంటప్పుడు 2019లో ప్రధాని పదవి నుంచి మోడీని దింపేస్తానని, ఇతరులను నిలబెడతానని చెప్పడం ఎలా తెలుగు గౌరవం నిలబడుతుందన్నారు.
చంద్రబాబూ! అలా చేస్తేనే తెలుగు గౌరవం నిలబడుతుంది
అందరినీ గౌరవించడం ద్వారానే తెలుగు గౌరవం నిలబడుతుందని చంద్రబాబుకు మోడీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్లా గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఏపీలోని ఓబీసీలకు, దళితులకు, గిరిజనులకు అవకాశమివ్వడం ద్వారానే తెలుగు గౌరవం నిలబడుతుందన్నారు. మీ స్వప్రయోజనాలు, మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి, ఏపీ కోసం ఆలోచిస్తేనే తెలుగు గౌరవం నిలబడుతుందన్నారు. పదవులపై ఆశలు వదిలేసి, ప్రజల కోసం పని చేయాలన్నారు. ఎన్టీఆర్ కలలు గన్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే అభివృద్ధి ఫలాలు ప్రతి ఏపీ వ్యక్తికి అందాలన్నారు. కేవలం కుటుంబానికే పరిమితం కావొద్దని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
పుత్ర వాత్సల్యంతో కాంగ్రెస్ ముందు మోకరిల్లారు
ఏపీ బీజేపీ కార్యకర్తలను ఎవరు బెదిరించలేరని, ఎందుకంటే వారు దేశం కోసం జీవిస్తున్నారని, వారి త్యాగాలు సుపరిచితమేనని, ఎంటువంటి విపత్కర పరిస్థితులను అయినా వెన్ను చూపకుండా ఎదుర్కొనే శక్తి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఉందని మోడీ అన్నారు. రెండు రోజుల క్రితం కాకినాడలో బీజేపీ మహిళా నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తికి అధికార దాహంతో రెండుసార్లు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో కలవడం రెండో వెన్నుపోటు అని అభిప్రాయపడ్డారు. పుత్రవాత్సల్యంతో కాంగ్రెస్ పెద్దల ముందు మోకరిల్లారన్నారు.