జగన్ బాటలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని- ఏలూరులో ఐదుగురు డిప్యూటీ మేయర్లు.. ఏడాదికొకరు..
ఏపీ స్ధానిక ఎన్నికల పోరులో మరో సంచలనం చోటు చేసుకుంది. పురపాలక ఎన్నికల్లో భాగంగా ఏలూరు నగరపాలక సంస్దకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధుల మధ్య డిప్యూటీ మేయర్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఐదుగురు కార్పోరేటర్ అభ్యర్ధులకు డిప్యూటీ మేయర్ అభ్యర్ధులుగా డిప్యూటీ సీఎం, స్ధానిక ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఏలూరు వైసీపీలో తీవ్ర పోటీ
ఏపీ స్ధానిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ కు జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు మంచి డిమాండ్ ఉంది. కార్పోరేషన్ లోని 50 స్ధానాలకు పోటీ చేస్తే చాలు గెలిచినట్లేనని అభ్యర్దులు భావించే పరిస్ధితి. అందుకే ఏదో రకంగా స్ధానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన ఆళ్లనానిని ప్రసన్నం చేసుకుని చాలా మంది కార్పోరేటర్ సీట్లు సంపాదించారు. దీంతో కార్పోరేటర్ పదవులు పొందిన నేతలు ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్దిత్వం కోసం పోటీ పడటం మొదలుపెట్టారు.
మేయర్ గా మరోసారి నూర్జహాన్..
వైసీపీ తరఫున మేయర్ అభ్యర్ధిగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ కు మరోసారి అవకాశం కల్పించింది వైసీపీ. అయితే ఈ పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన బొద్దాని శ్రీనివాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ దశలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఇంటి ముందే ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. మేయర్ అభ్యర్ధిత్వానికి పోటీ పడి సీటు రాకపోవడంతో నిరాశ చెందిన బొద్దాని శ్రీనివాస్ తో పాటు మరికొందరు చేసేది లేక డిప్యూటీ మేయర్ పదవి రేసులో నిలిచారు.
డిప్యూటీ మేయర్ కు డిమాండ్.
ఏలూరు మేయర్ వైసీపీ అభ్యర్ధిగా నూర్జహాన్ పేరు ముందే ఖరారైపోవడంతో ఇక కార్పోరేటర్ల చూపంతా డిప్యూటీ మేయర్ పైనే పడింది. దీంతో డిప్యూటీ మేయర్ గా తమకు అవకాశం ఇవ్వాలంటే తమకే ఇవ్వాలంటూ దాదాపు ఆరేడుగురు తీవ్ర ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం మొదలైంది. చివరికి ఓ ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఎవరినీ తప్పించే అవకాశం లేకపోవడంతో ఐదుగురినీ డిప్యూటీ మేయర్ పదవికి అభ్యర్ధులుగా ప్రకటించారు. అయితే వీరికో మెలిక పెట్టారు. ఒకేసారి ఐదుగురికి డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వీరిని ఏడాదికి ఒక్కరి చొప్పున అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
ఐదుగురికీ ఏడాది అవకాశం
డిప్యూటీలుగా ఎంపికైన వారిలో మేయర్ అభ్యర్ధిత్వం ఆశించి భంగపడిన బొద్దాని శ్రీనివాస్ భార్య జయశ్రీ, సుధీర్ బాబు, గుడిచేసి శ్రీనివాసరావు, పిల్లంగోళ్ల శ్రీదేవి, పైడి భీమేశ్వరరావు ఉన్నారు. వైసీపీ గెలిస్తే వీరంతా వరుస క్రమంలో ఏడాది పాటు మేయర్లుగా వ్యవహరిస్తారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఏడాది పదవి పూర్తి చేసుకున్న తర్వాత వీరంతా పదవుల నుంచి తప్పుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని వీరికి నిబంధన పెట్టారు. గతంలో సీఎం జగన్ తన కేబినెట్ లో మంత్రుల శాఖలకు విపరీతమైన డిమాండ్ నెలకొనడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసి సంచలనం రేపారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఆళ్లనాని కూడా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఏలూరులో ఐదుగురు మేయర్లను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది.