జగన్ నిర్ణయాన్ని కాపీ కొడుతున్న మరో రాష్ట్రం- మరింత పక్కాగా... అమలుతో పెను ప్రభావం..
కరోనా సంక్షోభం వేళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ నేను, నాకు, మాకు అనే సంకుచిత ధోరణినే ఆశ్రయిస్తున్నాయి. అమెరికాలోని ట్రంప్ సర్కారుతో మొదలుపడితే అందరిదీ ఇదే ధోరణి. ఉద్యోగాల్లో అయితే స్ధానికులకే ప్రాధాన్యత అంశం ఎప్పుడో తెరపైకి వచ్చింది. ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు స్ధానికులకు పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం కోటా ఇవ్వాలన్న చారిత్రక నిర్ణయం తీసుకోగా... తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కర్నాటక సహా పలు ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా సంక్షోభం నేపథ్యంలో మరో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
నాడు చంద్రబాబు..నేడు వైఎస్ జగన్: విజయవాడ స్వరాజ్ మైదాన్: బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం
జగన్ సాహసోపేత నిర్ణయం...
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సమస్యలతో పాటు నిరుద్యోగిత కూడా భారీగా పెరిగింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రెవెన్యూ లోటు భర్తీకి మొహమాటంగా స్పందిస్తుండటం వంటి సమస్యల మధ్యే సీఎం జగన్ తన పార్టీ మ్యానిఫెస్టో మేరకు ఓ సాహసోపేత నిర్ణయానికి తెరలేపారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వాలన్న ఆ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. అప్పట్లో దీని అమలు కష్టసాధ్యం అన్న అధికారులు సైతం జగన్ పట్టుదలతో దీన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తెగువే ఇప్పుడు మిగతా ప్రభుత్వాలను ఆలోచనలో పడేస్తోంది. తమ రాష్ట్రాల్లోనూ అమలుకు ప్రేరణగా నిలుస్తోంది.
జగన్ బాటలో మిగతా రాష్ట్రాలు...
ఏపీలో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయం అమలుకు అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కర్నాటకలో యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా దీని అమలుకు సిద్దమైంది. ఓ దశలో ఈ నిర్ణయం అమలుకు అనుకూలంగా,వ్యతిరేకంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ఎలాగోలా దీన్ని అమలు చేసేందుకే యడ్యూరప్ప ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని కాంగ్రెస్-శివసేన సంకీర్ణ ప్రభుత్వం అయితే ఏకంగా 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలను స్ధానికులకు కేటాయించాలని నిర్ణయించింది. తాజాగా హరియాణాలో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని బీజేపీ-జేజేపీ సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం స్ధానికులకు కేటాయిస్తూ త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని హర్యానా నిర్ణయించింది.
హర్యానా అమలు ఇలా
హర్యానాలోని దుష్యంత్ చౌతాలా సర్కారు ఆలోచన ప్రకారం ఇకపై రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే కేటాయించాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీలు, ట్రస్టులు వంటి వాటిలో నెలకు 50 వేల కన్నా తక్కువ జీతం ఉండే ఉద్యోగాల్లో 75 శాతాన్ని కచ్చితంగా స్ధానికులకే కేటాయించాల్సి ఉంటుంది. బాస్ ల స్ధాయిలో ఉండే ఉద్యోగాలకు మాత్రం ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చు. అయితే స్ధానిక అభ్యర్ధులు దొరకని పరిస్ధితుల్లో మాత్రమే కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుంది. మిగతా వారంతా ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని చౌతాలా ప్రభుత్వం చెబుతోంది.
Recommended Video
హర్యానాపై తీవ్ర ప్రభావం...
మిగతా రాష్ట్రాల్లో ప్రైవేటు ఉద్యోగాల్లో స్ధానిక కోటా ఇవ్వడంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా హర్యానాలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా పరిధిలోకి గురుగ్రామ్, ఢిల్లీ ఎన్.సి.ఆర్ కూడా వస్తాయి. ఇక్కడ పలు మల్టీ నేషనల్ కంపెనీలు, భారీ కార్పోరేట్ సంస్ధల కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు వీరంతా స్ధానిక కోటా అమలు చేయాలంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదీ కాక పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు ఎక్కువగా ఉంటాయి. లక్షల సంఖ్యలో జనం ఉద్యోగాలతో పాటు వ్యాపారాల కోసం హర్యానాకు వచ్చి స్ధిరపడిన వారు ఉన్నారు. ఇప్పుడు స్ధానిక కోటా ఉద్యోగాల పేరుతో వీరికి ఇబ్బందులు సృష్టిస్తే ఇది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే ఇప్పుడు హర్యానా సర్కారు మహారాష్ట్ర తరహాలో నేరుగా ఈ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా లేదు. స్ధానిక కోటాపై నిబంధల ప్రకారం ఆర్డినెన్స్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చౌతాలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.