జగన్ ది మూర్ఖత్వం, నియంతృత్వం ..కొల్లు రవీంద్ర అరెస్ట్ పై నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఫైర్
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కొల్లు రవీంద్ర అరెస్టుపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. టిడిపి నేతలు టార్గెట్ గా చేసుకొని వైసిపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. వైసిపి మంత్రి నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
మంత్రి పేర్నినాని అనుచరుడి హత్య కేసులో ట్విస్ట్..మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు
జగన్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారు
ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్ రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని,తన రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీసీల బలమైన నాయకులు తప్పుడు కేసులు పెట్టి ఇస్తున్నారని, బీసీలకు చేస్తున్న అన్యాయం బయటపడుతుందని భయం జగన్ రెడ్డిని వెంటాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో కొల్లు రవీంద్ర అరెస్ట్
వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలన లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై టిడిపి నేత కొల్లు రవీంద్ర పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేష్ అన్నారు. ఎన్నిసార్లు కోర్టుల నుండి చివాట్లు తిన్నా జగన్ రెడ్డి బుద్ధి మారడం లేదని నారా లోకేష్ విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారాన్ని తన కక్షసాధింపు ల కోసమే వినియోగించుకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం
కొల్లు రవీంద్ర అరెస్ట్ పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైరయ్యారు. కొల్లు రవీంద్ర అరెస్టు అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్షతో టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా లేకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు అప్రజాస్వామికమని మండిపడ్డారు. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.
ఆర్థిక నేరస్తులకు అడ్డాగా మారిన ఆంధ్ర ప్రదేశ్
టిడిపి సీనియర్ నేత కళా వెంకట్రావు కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండించారు. అక్రమంగా ఆయనపై హత్య కేసు పెట్టి అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే దాన్ని రవీంద్రకు ఆపాదిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అవినీతి ని ప్రశ్నించిన టిడిపి నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. బీసీలపై జగన్ పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్ర సౌమ్యుడు, మృదుస్వభావి అని పేర్కొన్న కళా వెంకట్రావు మచిలీపట్నం నియోజకవర్గం లో ఆయనకు ప్రజల వద్ద మంచి గుర్తింపు ఉందన్నారు.ఆర్థిక నేరస్తులకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని విమర్శించారు.
బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు
అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు,యనమల రామకృష్ణుడు,కొల్లు రవీంద్ర వంటి బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. అంతర్జాతీయ ఆర్ధిక నేరస్తుడిగా రాష్ట్రం పరువు తీసిన నాయకుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆర్థిక నేరస్తులుగా చిత్రీకరించాలని తెగ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడ్డదారిలో అరాచకాలు సృష్టిస్తూ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి పనిచేస్తుందని కళా వెంకటరావు మండిపడ్డారు.టిడిపి కార్యకర్తల నాయకుల్ని వేధింపులకు గురి చేయడం, భయబ్రాంతులకు గురి చేయడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు.
Recommended Video
జగన్ పాలనలో ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అయ్యాయి
వైయస్ జగన్ పాలనలో ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అయ్యాయని పేర్కొన్నారు. ప్రశ్నించేవారు ఉండొద్దు అన్న నిరంకుశ ధోరణి రాష్ట్రంలో తాజా పరిణామాలకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు అధికారులు శాశ్వత కాదన్న సంగతి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు, పోలీసులు కూడా గుర్తు పెట్టుకోవాలని కళా వెంకట్రావు హెచ్చరించారు. టిడిపి నేతలు కొల్లు రవీంద్ర అరెస్టుతో మరింత కష్టాల్లో పడ్డారు. వరుసగా పార్టీకోసం పనిచేస్తున్న నాయకుల అరెస్ట్ ల పర్వం కొనసాగుతుండడం వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తోంది .