ఏపీ సచివాలయంలో ఫుడ్ ఫెస్టివల్.. నోరూరించే 30 రకాల వంటకాలు, నేడే ప్రారంభం
పసందైన విందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదిక కాబోతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ 30 రకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్ను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
అమరావతి: పోషక విలువలతో కూడిన పసందైన విందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదిక కాబోతుంది. తెలుగునాట సుప్రసిద్ద వంటకాలుగా చరిత్ర గడించిన, తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ 30 రకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్ను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాలను ఆహార ప్రియులు స్వాగతిస్తున్నా.. పోషక విలువల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవి. మనం సక్రమమైన ఆరోగ్యంతో ఉండటానికి ఏ ఆహార పదార్థాలను ఏ మేర తీసుకోవాలన్నది కీలకం కాగా, తెలుగు వంటకాలలో ఈ తరహా ప్రత్యేకతలకు కొదవ లేదు.
దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టిన తరువాత.. పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం అందుకున్నాయి. అంతేకాకుండా సీఎం స్వయంగా చేసిన సూచనల మేరకు ఈ తెలుగు పోషకాహార పండుగను చేపడుతున్నారు.
ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలతో పాటు పోషక విలువల భరితమైన ఆహారం ఎంతో మేలు చేస్తోంది. ఏ ఏ పదార్థాలు తినడం మంచిది? వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఏలా ఉన్నాయి? అనే అంశాలపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారంలో ఇవి ఏమేరకు ఉన్నాయన్నది చాలా కొద్దిమందికే తెలుసు.
ఈ లోటును భర్తీచేస్తూ తేటతెలుగు వంటకాల విశిష్టతను వివరించేలా పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. శాఖాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినవి కాగా, మరికొన్ని అంతగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేక పోయాయి. ఈ లోటును భర్తీ చేయాలన్నదే పర్యాటక శాఖ ఉద్దేశ్యం.
మన వంటకాలు, షోషక విలువలతో కూడిన పూర్తిస్ధాయి సమాచారానికి పుస్తక రూపం కల్పించనున్నారు. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించనున్నారు. కాగా, తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసేందుకు గానూ జాతీయ, అంతర్జాతీయ పుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని పర్యాటక శాఖ భావిస్తుంది.
పర్యాటక శాఖ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్లో దాదాపు 30 రకాల వంటకాల్లో తెలుగుదనం ప్రతిబింబించే ముంత మసాలా రుచి, నెల్లూరు వడ, కొబ్బరి కుడుములు, కీరా వడ, అల్లం పెసరట్టు, శాఖాహారంలో దొండకాయ, కొబ్బరి కూర, తెలగపిండి, మునగాకు, మునగాకు పువ్వు కూర. కాకరకాయ ఉల్లికారం, అరటిపువ్వు కాంబినేషన్లో పెసరకూర, గుత్తి వంకాయ, ఉలవచారు, చింతచిగురు పప్పు, తోటకూర పప్పు, ఆనపకాయ పప్పు, ముక్కల పులుసు, దంపుడు బియ్యం, పెసరమొలకల పలావ్, మెంతికూర టమోటా అన్నం, పుల్లట్లు, రాగిముద్ద, పన్నీరు గంటి కుడుములు, బొంగు బిర్యాని.
ఇక మాంసాహారంలో కొత్తిమీర కోడి మసాలా, బొంగు చికెన్, గోంగూర మాంసం, దోసకాయ మాంసం, బీరకాయ రొయ్యల కూర, సొర పొట్టు కూర, తాటిబెల్లం ఉక్కరి, కొబ్బరి మీగడ పాయసం ఇలా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. ఈ వంటకాలన్నీ రుచి చూడాలంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కు రావలసిందే.