కోడి కూర కోసం: పెళ్ళిలో రాళ్ళతోనే దాడి..పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
ఎక్కడైనా వివాహం జరుగుతుందంటే అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుంటారు. అందరూ కలిసి సంతోషంగా వివాహం జరిపిస్తారు. వధువు తరపు బంధువులు చేసిన ఏర్పాట్లు నచ్చకుంటే చిన్న చిన్న వాదనలు మినహాయించి పెళ్లి అంతా బాగానే జరుగుతుంది. కానీ రాళ్లతో కొట్టుకునే దాకా మాత్రం వెళ్లదు. కేవలం భోజనాల వద్ద కోడికూర పెట్టలేదని రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
జనసేనకు మరో సీనియర్ నేత గుడ్ బై.... పవన్ కు వరుస షాకులు
చికెన్ కోసం పెళ్ళిలో పంచాయితీ ... రాళ్ళతో కొట్టుకున్న వధూవరుల తరపు బంధువులు
శ్రీకాకుళం జిల్లా సారవకోట స్థానిక రెల్లివీధిలో జరిగిన వివాహ వేడుక కేవలం కోడి కూర కోసం రచ్చ రచ్చగా మారింది. వధూవరుల తరపు బంధువులు పెళ్లి పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా రాళ్ళతో కొట్టుకున్నారు. చికెన్ వడ్డించ లేదని భోజనాల దగ్గర చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివాన అయింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రెల్లివీధికి చెందిన కూన సురేష్కు బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందిని అలియాస్ ఉషతో వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.
చికెన్ సరిగా పెట్టలేదని భోజనం ప్లేట్లు ముఖంపై కొట్టిన వరుడి బంధువులు
కూన సురేష్ నందినీల వివాహ వేడుక సందర్భంగా మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర పెండ్లికుమార్తె తరపు బంధువులు కళింగపట్నం ప్రకాష్ చికెన్ వడ్డిస్తుండగా పెళ్లి కుమారుడి వర్గం వారు తమకు చికెన్ సరిగ్గా పెట్టలేదని కోపంతో భోజనం ప్లేట్లు ముఖంపై కొట్టారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చికెన్ వడ్డింపు సమయంలో పెళ్లి కుమార్తె ,పెళ్లి కుమారుడి వర్గాలుఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఇక ఈ ఘర్షణ మరింత ముదిరి రెండు వర్గాల వారు ప్రధాన రోడ్డు మీదకు వచ్చి రాళ్లతో కొట్టుకున్నారు.
రాళ్ళతో కొట్టుకున్న ఇరు వర్గాలు ... ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలు
ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడి వర్గానికి చెందిన కళింగపట్నం గణేష్ మెడలోని బంగారు గొలుసు పోయినట్లుగా, ఇక ఆ గొలుసులు వధువు వర్గం వారు తీసుకున్నట్లు ఆరోపించారు. దీంతో గొడవ మరింత పెరిగింది. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలవారు శాంతించారు . ఇక ఈ ఘర్షణలో పెండ్లికి వచ్చిన వారు, వధూవరుల తాలూకు బంధువులు గాయాలపాలయ్యారు.
పోలీస్ స్టేషన్ చేరిన పంచాయితీ ... ఇరు వర్గాల ఫిర్యాదులు .. కేసులు నమోదు
ఈ ఘర్షణకు సంబంధించి సారవకోట గ్రామానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమారుడి వర్గానికి చెందిన నలుగురిపై,నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. గాయపడిన వారినిపాతపట్నం ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. ఇక చికెన్ కోసం జరిగిన ఘర్షణ విన్నవాళ్ళు కోడి కూర కోసం పెళ్లి పక్కన పెట్టి ఇంత పంచాయతీనా అని నోరెళ్ళబెడుతున్నారు .