స్టీల్ప్లాంట్కు సొంత గనుల కోసం...సిఐటియు వినూత్న నిరసన: 700 మంది రక్తదానం
విశాఖపట్టణం:స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించకపోవడంపై సిఐటియు వినూత్న తీరులో నిరసన తెలిపింది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 700 మంది రక్తదానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన సందేశం తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు సత్వరమే కేటాయించాలనే డిమాండ్ తో స్టీల్ ప్లాంటులోని పలు విభాగాల కార్మికులు, అధికారులు, అప్రెంటీస్ సిబ్బంది, యువతీ, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం ద్వారా తమ బలీయమైన ఆకాంక్షను తెలియజెప్పారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా విశాక స్టీల్ప్లాంట్ ప్రాంగణంలో ఈ ఘట్టం చోటుచేసుకుంది.
ప్రభుత్వాలు...కళ్లు తెరవాలి
గురువారం ఉదయం స్టీల్ప్లాంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు ప్రారంభించారు.ఉదయం 8 గంటలకు ప్రారంభమైన శిబిరం సాయంత్రం 5 గంటల వరకూ అదే స్ఫూర్తితో కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగరావు మాట్లాడుతూ, వందలాది మంది కార్మికుల రక్తదానాన్ని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు. సొంత గనులు కేటాయిస్తే స్టీలు ప్లాంటు అభివృద్ది అత్యన్నత స్థాయిలో ఉంటుందని తెలిసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడం దారుణమన్నారు.
పెట్టారు...పడి...లేచింది
విశాఖ స్టీల్ ప్లాంట్ కు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1982 ఫిబ్రవరి 18న విశాఖ స్టీల్ప్లాంట్ పనులు ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూడున్నర దశాబ్ధాలను పూర్తి చేసుకుంది. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభంలోనే అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంది. కర్మాగారం నిర్మాణం ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి అప్పులు కూడా పెరిగిపోయాయి. వడ్డీ భారంతో 1998వ సంత్సరానికి స్టీల్ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితు ల్లో స్టీలు ప్లాంటు యాజమాన్యం, అధికారులు, కార్మికులు స మిష్టిగా పనిచేసి, కష్టించి ఉత్పత్తిని పెంచి, ప్రభుత్వ సహకారం కూడా కొంత తోడవ్వడంతో తక్కువ కాలంలోనే లాభాల బాట పట్టించారు.
అభివృద్ది పథంలో...పైకి
విశాఖ ఉక్కు కర్మాగారం 2001 నుంచి ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ అప్పులను తీర్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తూ దేశీయ పారిశ్రామిక యవనికపై గర్వంగా నిలబడింది. అంతేకాకుండా 2004 సంవత్సరానికి టర్నోవర్ రేంజ్ సాధించింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం రూ.12,300 కోట్లతో విస్తరణ దిశగా ముందుకు సాగడంతో 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. తాజాగా మరో నాలుగువేల కోట్లతో పాత యూనిట్లను ఆధునీకరించింది. దీంతో మరో పది లక్షల టన్నుల సామర్ధ్యం పెంచుకోగలిగింది. ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుంది.
ఎందుకిలా?...స్పందించండి
విశాఖ స్టీల్ప్లాంట్ ద్వారా 18,800 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 25వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే సొంత గనులు లేకపోవడం వల్ల లాభాల నుంచి ముడిసరుకుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఛత్తీష్ఘడ్ రాష్ట్రం నుంచి బైలడిల్లా ప్రాంతం నుంచి ముడిసరుకును ఇక్కడకు దిగుమతి చేసుకుంటుంది. ఎన్ఎండిసి నిబంధనల ప్రకారం అక్కడ నుంచి అవసరమైన గనులను స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన స్టీల్ప్లాంట్ ఆపరేషన్స్ డైరక్టర్ పికె.రత్ మాట్లాడుతూ సొంత గనుల కోసం రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన ఉద్యోగులను, కార్మికులను అభినందించారు. తాను 1983లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సొంత గనుల కోసం నిరీక్షిస్తూనే ఉన్నామన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు.