బాబుతో కమల్హాసన్ భేటీ?: మోడీకి 'దక్షిణాది' చెక్, ఆ తర్వాతే గొంతుపెంచిన టీడీపీ అధినేత!
Recommended Video
అమరావతి/చెన్నై: 2019 ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి చెక్ చెప్పేందుకు కొన్ని పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కావొచ్చునని అంటున్నారు.
కమల్ హాసన్ 'దక్షిణాది' రాజకీయం: పార్టీ గుర్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ పార్టీకి పట్టు ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్నాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు పట్టు ఉంది. అయితే సౌతిండియాపై కన్నేసిన నేపథ్యంలో సంయుక్తంగా చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
బీజేపీపై దక్షిణాది ఆయుధం
ఇందుకు, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును, కేరళ సీఎం పినరాయి విజయన్ను మెచ్చుకోవడమే నిదర్శనం అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్న ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను తన పార్టీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
బీజేపీ మిత్రుడు చంద్రబాబుకు ప్రశంస
కమల్ హాసన్ చాలాకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రాజకీయాల్లోకి వస్తానని తేలిపోయాక దాడి పెంచారు. ఓ వైపు తమిళనాడులో అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కమల్ హాసన్ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబును ప్రశంసించారు.
చంద్రబాబు మాటల్లో మార్పు
ఏపీకి విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు ఎప్పుడైనా పెటాకులు అవుతుందనే ప్రచారం సాగుతోంది. అందుకు తగినట్లుగా ఏపీకి చెందిన ఆ పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం సాగుతోంది. నవ్యాంధ్రకు కేంద్రం సాయం అవసరమని చెబుతున్న చంద్రబాబు.. మాటల్లో ఇటీవల మార్పు కనిపిస్తోందని అంటున్నారు.
కమల్ హాసన్తో మాట్లాడిన తర్వాత మోడీపై మరింత ఘాటుగా
బుధవారం పార్టీ ప్రకటన సమయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మంగళవారం తనతో ఫోన్లో మాట్లాడారని, ఈ సందర్భంగా ప్రజలకు ఏం చేయాలనే విషయాలపై సలహాలు ఇచ్చారని, ఇతర అంశాల గురించి ఆందోళన చెందవద్దని చెప్పారని వ్యాఖ్యానించారు. తన హీరో చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాటికి చంద్రబాబు కేంద్రంపై మరో అడుగు ముందుకేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, అరకొర సాయం చేశారని, ఏపీకి న్యాయం చేయాలని గట్టిగా అడుగుతున్నానని అల్టిమేటం జారీ చేశారు.
ఏపీలో చంద్రబాబు-పవన్కు లెఫ్ట్ జత
అంతకుముందు, బీజేపీ మనకు మిత్రపక్షమని, ఆ పార్టీ నేతలు నోరు జారినా మనం ఏమీ అనవద్దని, కేంద్రం సాయం అవసరమని చెబుతూ వచ్చిన చంద్రబాబు స్వయంగా బహిరంగ సభలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. దీంతో కేవలం ఏపీలోనే కాకుండా దక్షిణాదిన బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు బీజేపీకి గుడ్ బై చెబితే ఏపీలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్-లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు దక్షిణాది రాజకీయాల పైనే చర్చ సాగుతోంది.
ఇందుకు పలు కారణాలు
ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కమల్ హాసన్.. ఏపీకి చెందిన చంద్రబాబు, కేరళకు పినరాయి విజయన్ను ప్రశంసించడం, తన పార్టీ గుర్తులో ఆరు చేతులు కలిసి ఉండటం.. ఆరు దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పడం, చంద్రబాబు మాట తీరులో మార్పు రావడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
మరో కారణం, త్వరలో భేటీ అవుతున్నారా?
మరో ముఖ్య విషయం ఏమంటే బీజేపీని నిత్యం విమర్శిస్తున్న కమల్ హాసన్కు చంద్రబాబు ఫోన్ చేయడం గమనార్హం. తనకు చంద్రబాబు ఫోన్ చేశారని కమల్ చెప్పారు. నేను మీ అభిమానిని అని చంద్రబాబు కమల్తో చెప్పారట. ఓసారి కలుద్దామని కూడా అడిగారట. అయితే ప్రస్తుతం పార్టీ ఆవిర్భావం బిజీలో ఉన్నందున త్వరలో కలుద్దామని కూడా పవన్ చెప్పారట. భేటీ అవుదామని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ సాగుతోంది.
రెండు పార్టీలకు దూరంగా ఉండేవారు
కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు దూరంగా ఉండే దక్షిణాది నాయకులు ఒక్కటవుతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. కేరళలో లెఫ్ట్, తమిళనాడులో కమల్ హాసన్, ఇతరులు, ఏపీలో చంద్రబాబు (బీజేపీని కాదనుకొని బయటకు వస్తే)లు ఏకతాటి పైకి వస్తారా అనే చర్చ సాగుతోంది. మరో విషయం ఏమంటే.. మీ సిద్ధాంతాలు, నా సిద్ధంతాలు వేరు అని కూడా కమల్-చంద్రబాబుల మధ్య సంభాషణ జరిగినట్లుగా చెప్పారు. దీంతో ఏం జరుగుతుందనేది చూడాలని అంటున్నారు.
ఢిల్లీలో దక్షిణాది చక్రం
ఓ రాష్ట్రం నాయకులు ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపగలరా అనే అనుమానం కొందరికి రావొచ్చు. కమల్ హాసన్కు ఉన్న అభిమాన గణం గురించి చెప్పాల్సిన పని లేదు. బతుకు దెరువు కోసం ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్లిన వారు చాలామంది ఉన్నారు. గత కర్నాటక ఎన్నికల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దక్షిణాదిని కేంద్రం మరోలా చూస్తుందని ఇప్పటికే కమల్, పవన్ కళ్యాణ్ వంటి వారు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఏపీకి అన్యాయం జరుగుతోందని, ఏపీ ఏమైనా ఈ దేశంలో భాగం కాదా అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్కు చెక్ చెప్పేందుకు, కేంద్రంలో దక్షిణాది చక్రం కోసం ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.