రాజధాని అమరావతి కోసం: మేడారం వెళ్లిన రైతులు.. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు
రాజధాని అమరావతి రైతుల దీక్షలతో హోరెత్తుతోంది. ఆందోళనల పర్వం 53వ రోజుకు చేరింది. రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులది త్యాగం కాదా. అంటూ నిలదీస్తున్నారు . మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రీలే దీక్షలు నిర్వహించాతమే కాకుండా రాజధాని అమరావతి కోసం తెలంగాణా కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళారు రాజధాని అమరావతి రైతులు.
కోరి కొలిచిన వారి కొంగు బంగారం అయిన మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మొక్కుకున్నారు . అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మేడారం అమ్మవార్లకు ఆంధ్రా రైతులు, మహిళలు మొక్కులు సమర్పించారు.
బంగారాన్ని నివేదించి తమ గోడు ఆ తల్లులకు చెప్పుకున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అని చాలా రోజులుగా పోరాటం చేస్తున్న వారు ఇప్పటికే పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు, గోవింద నామాలు, లలిత సహస్ర నామాలు జపిస్తున్నారు.
ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని మేడారం వెళ్లి మరీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, సీఎం జగన్ మనసు మార్చాలని కోరుకుంటూ వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించారు. సమ్కక్క, సారలమ్మకు తమ గోడు వినిపించడం కోసమే ఇక్కడికి వచ్చామని వారు సమ్మక్క, సారలమ్మల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. జై అమరావతి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. రాజధాని అమరావతి కోసం మొక్కులు చెల్లించి తమ కోరిక తీర్చమని ఆ వనదేవతలను కోరుకున్నారు.