హైదరాబాద్ నుంచి తరిమివేశారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర వారు కూడా, టీజీ వెంకటేశ్ సంచలనం
నవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. అమరావతి, విశాఖపట్టణంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అమరావతి, కర్నూలులో కూడా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాజధానిపై రగడ, మినీ సెక్రటేరియట్పై పట్టు, టీజీ వెంకటేశ్ డిమాండ్
వారం, ఏడాదికోసారి..
అవసరం ఉన్న రాజధాని అమరావతి వెళ్లడానికి వారం రోజులకు వెళ్లేవారమని టీజీ వెంకటేశ్ చెప్పారు. ఒకవేళ విశాఖపట్టణంలోనే సచివాలయం ఉంటే ఏడాదికోసారి కూడా వెళ్లడం వీలుకాదన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి సచివాలయంలో పని ఉంటే విశాఖపట్టణం వెళ్లడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమరావతి, విశాఖపట్టణంలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి.. జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు.
ఫ్రీ జోన్ చేయలే..
అమరావతి ఫ్రీ జోన్ చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రజలకు కూడా సచివాలయం, హైకోర్టు తదితర స్థానిక ఉద్యోగాలు లభిస్తుండేవని చెప్పారు. దీనిపై తను టీడీపీలో ఉన్నప్పుడు కూడా కోరినట్టు గుర్తుచేశారు. కానీ చంద్రబాబు నాయుడు తమ డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే ఏర్పాటు చేశారని, కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో శాశ్వత భవనాలను కూడా నిర్మించినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రావారిని తరిమేశారు..
అమరావతి రైతులకు మాత్రం న్యాయం చేయాలని టీజీ వెంకటేశ్ కోరారు. హైదరాబాద్ రాజధానిగా ఉండి ఏపీ విభజన పూర్తవడంతో అక్కడినుంచి తమను తరిమివేశారని పేర్కొన్నారు. విశాఖపట్టణంలో సచివాలయం నిర్మించి, మినీ సెక్రటేరియట్ నిర్మించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రవారిని తరిమివేశారని గుర్తుచేశారు.
ఉత్తరాంధ్ర వారు కూడా..
విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర వారు రాయలసీమ వారిని తరిమేస్తారు అని పేర్కొన్నారు. సీమ, కోస్తాంధ్ర వారిని వెళ్లగొడితే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు మంచి పరిణామమేనని, దానిని మరింత పరిపూర్ణం చేయాలని కోరారు. రాయలసీమ, అమరావతిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టంచేశారు.