ఆ చేతి రాత రిషికేశ్వరిదే: తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక, ఎస్పీకి అందజేత
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయంలోని విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషికేశ్వరిదేనని నివేదికలో తేల్చింది.
మొత్తం రెండు డైరీలతో పాటు రిషికేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్లలోని రిషికేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు.
ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సీనియర్ల ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని రిషికేశ్వరి తండ్రి ఓ లేఖ రాశారు. ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు కొనసాగించి తమకు న్యాయం చేయాలని కోరారు.