టీడీపీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు: ఎన్నికల వేళ..ఫోర్జరీ చేసి..: ఎమ్మార్వో ఫిర్యాదుతో..!
మరో టీడీపీ నేతల మీద కేసు నమోదైంది. అనేక ఆరోపణలతో ఒకరి తరువాత మరొక టీడీపీ నేత కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన ఏకంగా ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో స్థానికంగా పేదలకు ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన ఇళ్ల పట్టాలను అందించారనేది ఆయన మీద అభియోగం. తన సంతకం ఫోర్జరీ చేసి పేదలను మోసగించారంటూ ఆయన మీద తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని తన మీద నమోదైన కేసుల కారణంగా జైళ్లో ఉన్నారు. ఇక, వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ.. కూన రవి కుమార్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో పేదలను ఏమార్చి తప్పుడు పట్టాలతో..ఓట్ల కోసం పేదలను మోసం చేసారనే అభియోగంతో ఇప్పుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద హనుమాన్ జంక్షన్ లో కేసు నమోదైంది.
తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు
మరో టీడీపీ కీలక నేత..ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాగైన గెలవాలనే ఉద్దేశంతో అక్కడ పేద ప్రజలను ఏమార్చి ఏకంగా తహసీల్దార సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసారని వంశీ మీద ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా.. వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపుల పాడు తో సహా అనేక గ్రామాల్లో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసారు.
ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా
గతంలో అక్కడ పని చేసి వెళ్లిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జీర చేసి..ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా నమ్మించి ఓటర్లకు అందించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో ప్రాధమికంగా విచారణ చేసారు. దీని పైన బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీతో పాటుగా ఆయన ప్రధాన అనుచరుల మీద హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు. కేవలం ఎన్నికల్లో గెలవటంతో కోసమే ఇలా నకిలీ పట్టాలను పేదలకు అందించారని ..అందునా ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేయటంతో..ఇప్పుడు రాజకీయంగా ఇది మరో టర్న్ తీసుకొనే అవకాశం ఉంది.
వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో అనేక అభియోగాలు ఉన్నా.. ఇబ్బంది లేకుండా ఉన్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన రిమాండ్ ఖైదీగా ఉంటూ..అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ విప్ కూన రవి కుమార్.. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వెంకట రమణ.. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత యరపతినేని శ్రీనివాస రావు వంటి వారు సైతం చిక్కుల్లో పడ్డారు. పల్నాడు మైనింగ్ కేసు సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, తమ నేతల మీద ఉద్దేశ పూర్వకంగానే కేసులు నమోదు చేసి ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక, ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ ఎన్నికల సమయం లో చేసిన వ్యవహారం పైన కేసు నమోదు కావటంతో..ఇప్పుడు మరో సారి రాజకీయంగానూ ఈ అంశం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం ఉంది.