కొత్త జిల్లాల ఏర్పాటులో మరింత జాప్యం: కారణం?: ఆ ప్రక్రియ పూర్తయిన తరువాతే: 26 వైపే
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తొలుత భావించినప్పటికీ.. కొంత ఆలస్యం కావచ్చని సమాచారం. నూతన తెలుగు సంవత్సరాది ఉగాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుగా అనుకున్నట్టే- పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాలు ప్రకటిస్తారని, ఈ సంఖ్య 26 వరకే పరిమితం అవుతుందని అంటున్నారు.
భూ సర్వే కారణంగా..
జగన్ సర్కార్ కొత్తగా రాష్ట్రంలో భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర భూ సర్వే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కిందటి నెల 21వ తేదీన ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. దీనిపై రాజకీయంగా విమర్శలు చెలరేగిన ప్రస్తుత పరిస్థితుల్లో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే చేపట్టారు. మొదటి దశలో అయిదువేల గ్రామాల్లో భూ రీసర్వే కొనసాగుతోంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు.
భూ సర్వే కొనసాగుతోన్న సమయంలో..
రాష్ట్రంలో భూ సర్వే కొనసాగుతోన్న ప్రస్తుత సమయంలో కొత్త జిల్లాల గురించి ప్రకటన చేయడం సరికాదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రెవెన్యూ డివిజన్ల పరిధులు మారిపోయే అవకాశం ఉందని, దీని ప్రభావం సమగ్ర వైఎస్సార్- జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై పడుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ సమగ్ర భూ రీసర్వే పూర్తయిన తరువాత.. కొత్త జిల్లాలను ప్రకటించడం, జిల్లాల పునర్విభజనకు పూనుకోవడం బాగుంటుందనే అభిప్రాయాలు అధికార వర్గాల నుంచి వ్యక్తమౌతున్నాయి. దీనిపై తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రే తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
26 వైపే మొగ్గు..
ఇదివరకు జిల్లాల సంఖ్య 30కి పైగా ఉండొచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. లోక్సభ పరిధి విస్తృతంగా ఉన్న చోట రెండుగా విభజిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. వాటకి బ్రేక్ పడింది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు అందించిన తాజా నివేదిక.. 26 జిల్లాల వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఒక్క అరకు లోక్సభ మాత్రమే రెండుగా విభజిస్తారని, పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఈ నివేదిక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
అరకు ఎందుకంటే..
అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో గిరిజన, ఆదివాసీల జనాభా అధికం. విస్తీర్ణమూ పెద్దదే. ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ. రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పించడానికి, వాటిని మరింత సరళీకరించడానికి ఈ జిల్లాలను రెండుగా విభజించాల్సి ఉంటుందని అధికారులు కమిటీ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం.. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు-1 జిల్లా, అరకు అసెంబ్లీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అరకు-2 పరిధిలోకి తేవాలని సూచించినట్లు సమాచారం.