వైసీపీలోకి మాజీ మంత్రి రామచంద్రయ్య, జగన్ సమక్షంలో 13న పార్టీలో చేరనున్న సీనియర్ నేత
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఈనెల 13న ముహూర్తం ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రామచంద్రయ్య కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీలోని ప్రధాన నాయకులంతా హస్తానికి గుడ్బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన రామచంద్రయ్య ఈ నెల 13న బొబ్బిలిలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కూడా కాంగ్రెస్ టీడీపీ పొత్తును నిరసిస్తూ పార్టీని వీడిన విషయం తెలిసిందే.
ఇక విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. గాయం నుంచి కోలుకున్న జగన్ సోమవారం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేపు హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి వెళతారు. విజయనగరంలో జగన్ బస చేస్తారు. సోమవారం రోజున పాయకపాడు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు జగన్.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై చాలామంది కాంగ్రెస్, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే చాలామంది వారి వారి పార్టీలను వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మరికొదరు నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.