మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కన్నుమూత... సీఎం జగన్ దిగ్భ్రాంతి...
ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్.రామచంద్రరావు గురువారం(అగస్టు 20) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 7గం. సమయంలోతుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.
రామచంద్రరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి సైన్స్ పట్టా పుచ్చుకున్న రామచంద్రరావు,మద్రాస్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. సుప్రీం కోర్టులో,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను రామచంద్రరావు వాదించారు. ఎన్నో ప్రభుత్వ,ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఆయన వాదించారు. ఆయన వాదించిన సంచలన కేసుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేసు కూడా ఒకటి. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలతో దాఖలైన రిట్ పిటిషన్ విచారణలో సీఎం తరుపున రామచంద్రరావు వాదించారు.
Recommended Video
అప్పట్లో నారా చంద్రబాబు నాయుడును కర్షక పరిషత్ చైర్మన్గా నియమించడాన్ని హైకోర్టు పక్కన పెట్టిన కేసునూ రామచంద్రరావు వాదించారు. విచారణ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్న దాదాపు 10వేల మంది విముక్తికి హైకోర్టు తీర్పు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.