ఏం జరిగింది!: మాజీ ఎయిర్ హోస్టెస్ మృతి, కుప్పకూలిన టీచర్
హైదరాబాద్/ఏలూరు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం రీతు అనే మాజీ ఎయిర్ హోస్టెస్ తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. స్థానికులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్లో జరిగింది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.
ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు రీతు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది. రీతుకు తలమీద తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. రీతు భర్త పేరు సచిన్. వీరిది ప్రేమ వివాహం. 2013లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి స్వస్థలం జార్ఖండ్. పెళ్లైన తర్వాత ఆమె ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాగా, రీతు మృతికి భర్తనే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కుప్పకూలిన టీచర్
ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే కుప్పకూలారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పలపూడిలో ప్రియ అనే ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందారని తెలుస్తోంది.
యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఖైదీ
చర్లపల్లి జైలులో శేఖర్ అనే ఖైదీ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అధికారులు అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శేఖర్ ఓ కేసులో జీవిత ఖైదీ శిక్షను అనుభవిస్తున్నాడు.
పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం
తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ నల్లకుంట పీఎస్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అత్తింటి ఎదుట మహిళా సంఘాల ఆందోళన
కుమారుడు మృతి చెందడంతో అత్తమామలు కోడలును బయటకు తరిమేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. బాధితురాలైన కోడలు మహిళా సంఘాలను ఆశ్రయించారు. దీంతో వారు అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టారు.