అందుకే వచ్చా: కాంగ్రెస్లో చేరగానే మోడీపై కిరణ్ విమర్శలు, వద్దని చెప్పా..
Recommended Video
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో తనది విడదీయరాని బంధమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే నవ్యాంధ్రకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలవుతాయని చెప్పారు. మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పారు.
నాలుగేళ్ల తర్వాత తిరిగి సొంత పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి!
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా తమ కుటుంబం మెలిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్లను వెనక్కి రప్పిస్తామని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీ, తెలంగాణలకు న్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.
హామీల అమలులో కేంద్రం విఫలం
విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన మాట చట్టంతో సమానమని వ్యాఖ్యానించారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు.
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం విభజన హామీలలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్ ఏం చెప్పినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను జనాలకు పరిచయం అయ్యానంటే అందుకు కాంగ్రెస్ తరఫున తాను గెలవడమే కారణం అన్నారు.
నేను ఈ స్థాయికి రావడానికి రెండు కారణాలు
నేను ఎమ్మెల్యేగా, చీఫ్ విప్గా, స్పీకర్గా, ముఖ్యమంత్రిగా ఉన్నానంటే.. అందుకు రెండే కారణాలు అని, అందులో ఒకటి తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం, రెండోది గాంధీ కుటుంబానికి తన ఫ్యామిలీ దగ్గరగా ఉండటమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణలకు ఎయిమ్స్, యూనివర్సిటీలు, స్టీల్ ప్లాంట్లు, పోలవరం ప్రాజెక్టు.. ఇవన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి రావాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే దేశానికి దశ, దిశ అన్నారు.
వెళ్లిన వారిని తీసుకొస్తాం, తమ్ముడు టీడీపీలో చేరడంపై
గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఇతర పదవులు అనుభవించిన దాదాపు ముప్పై నలభై మందితో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అందులో చాలామందిని తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి వెళ్లవద్దని (టీడీపీలోకి) చెప్పానని, ఆయన వెళ్లాడని తెలిపారు.