జగన్ కంటే కిరణ్ రెడ్డి నయం, పదవి త్యాగం చేశారు, నాకూ రోషం ఉంది కానీ: బాబు షాకింగ్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిన సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంకు ధీటుగా పీలేరును తీర్చిదిద్దుతానని స్పష్టం
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిన సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంకు ధీటుగా పీలేరును తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
ఈడీ నివేదిక ప్రకారం దేశంలో మనీలాండరింగ్ చేసిన పెద్దల్లో జగన్ కూడా ఉన్నారని, ఇటువంటి అవినీతిపరులు రాష్ట్రానికి అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. తనను సీఎం చేయాలని రాష్ట్రంలో తిరుగుతున్న వ్యక్తి, దేశంలో టాప్ టెన్ అవినీతిపరుల్లో ఒకరు జగన్ అన్నారు.
Recommended Video
టీడీపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్, పీలేరులో ఇలా..
జగన్ అవినీతి వ్యవహారాల గురించి చర్చించాలి
జగన్ వంటి వ్యక్తులు రాష్ట్రం పరువు తీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వీరి అవినీతి వ్యవహారాల గురించి చర్చించాలన్నారు. వీరి నేపథ్యం చేసిన పనులు ప్రజలకు తెలిసేలా చేయాలని అన్నారు. హవాలా వ్యాపారం చేసిన వారు అధికారం కోసం తహతహలాడుతున్నారని, అసెంబ్లీకి రారని, ప్రజల సమస్యల గురించి మాట్లాడరని, అభివృద్ధికి అడ్డుపడతారని మండిపడ్డారు.
కిరణ్ రెడ్డికి బాబు ప్రశంసలు, సీఎం పదవినే త్యాగం చేశారు
ఈ సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికు చంద్రబాబు కితాబు ఇవ్వడం గమనార్హం. జగన్ కన్నా కిరణ్ నయం అన్నారు. తన పదవి పోయినా పర్వాలేదనుకొని కిరణ్ రెడ్డి రాష్ట్రం కోసం పోరాడారని, సీఎం పదవి త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. జగన్ మాత్రం తన కేసుల కోసం రాజీపడ్డారని ధ్వజమెత్తారు. కాగా కిరణ్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా.. వారి మధ్య పలుమార్లు సభలోను వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భాలు ఉన్న విషయం తెలిసిందే.
నాది చిత్తూరు జిల్లానే కానీ
వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఏకపక్షంగా గెలిపించాలని చంద్రబాబు అన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి తనకు ముందే చెప్పారని, ఏ పార్టీలో చేరాలా అని ప్రతి గ్రామం వెళ్లి తమ వారి మధ్య చర్చ పెడితే, అందరూ టీడీపీలో చేరాలని సూచించారని చెప్పాడని తెలిపారు. నాది చిత్తూరు జిల్లానే అని, 600 వాహనాల్లో తరలి వచ్చారని, పీలేరు నియోజకవర్గంలో ఇంత స్పందన గతంలో చూడలేదన్నారు. అన్ని నియోజకవర్గాలకు పీలేరు స్పూర్తి అన్నారు.
నల్లారి కుటుంబానికి ప్రత్యేక చరిత్ర
నంద్యాల, కాకినాడల్లో ప్రజలు టీడీపీకి 16 శాతం ఆధిక్యం ఇచ్చారని, వారి తీర్పు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కృషి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉందని, నల్లారి అమర్నాథ్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన తనయుడు కిరణ్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు.
జగన్ ఏదేదో మాట్లాడుతారు
అలాంటి కుటుంబం నుంచి టీడీపీలో చేరేందుకు కిషోర్ కుమార్ రెడ్డి వస్తే సొంత డబ్బులతో 600 వాహనాల్లో జనాలు వచ్చారని చంద్రబాబు అన్నారు. జగన్ స్వార్ధ రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడన్నారు. నడిరోడ్డులో ఉరితీయాలని ఓసారి, చెప్పుతో కొట్టాలని మరోసారి మాట్లాడటం విడ్డూరమన్నారు.
నేను అలాంటి మాటలు మాట్లాడను కానీ, రోషం ఉంటుంది
నేను ఎప్పుడు జగన్ మాట్లాడినటువంటి మాటలు వాడలేదని, ఇక ముందు వాడను కూడా అని చంద్రబాబు అన్నారు. నేనూ మనిషినేనని, తనకూ రోషం ఉంటుందని, అయితే ఎన్ని తిట్టినా ప్రజల కోసం పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
చీకటిలో ఉన్న ఏపీకి వెలుగులా బాబు
కాగా, కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి పలువురు సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలకి ఆహ్వానించారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ.. కార్యకర్తల అభిమతం మేరకే టీడీపీలో చేరానని చెప్పారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ చీకటిలో ఉన్న ఏపీకి బాబు వెలుగులా కనిపించారన్నారు.