హిందూ ధర్మ పరిరక్షణ కట్టుబొట్టులో ఉంటే సరిపోదు: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ చురకలు
అమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు.. మరోసారి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. హిందు ధర్మాన్ని పరిరక్షించడానికి మాటలు చెబితే సరిపోదని, ప్రకటనలు చేస్తే చాలదని చెప్పారు. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆచరణలో పెట్టడంతోనే హిందు ధర్మ పరిరక్షణ సాధ్యమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వాటి గురించి ప్రజలకు వివరించాలని టీటీడీకి సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడులో వైఎస్ జగన్ భారీ కటౌట్: సీఎం పళనిస్వామి సహా
శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఎందుకు?
ఆలయాల జీర్ణోద్ధారణ, కొత్త దేవాలయాలను నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ పేరుతో విరాళాలను సేకరిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో దీన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ ట్రస్ట్కు 10 వేల రూపాయలను విరాళంగా ఇచ్చిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. ఇప్పటికే ఈ ట్రస్ట్కు అందిన విరాళాల మొత్తం వంద కోట్ల రూపాయలను దాటింది. రెండు నెలల వ్యవధిలోనే వంద కోట్ల రూపాయల మార్క్ను అందుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు పది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వందలాది మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.
ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ, ఆలయాల జీర్ణోద్ధారణ
10 వేల రూపాయల విరాళంతో వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తోన్నందున.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భక్తులు కూడా దీని ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుంటోన్నారు. ఈ రూపంలో అందిన నిధులను టీటీడీ అధికారులు కొత్త ఆలయాల నిర్మాణం, నిర్వహణ, పాత దేవాలయాల జీర్ణోద్ధారణ కోసం ఖర్చు చేస్తోంది. పండుగల వంటి ప్రత్యేక రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని దేవాలయాల్లో పూజలు, హోమాలను నిర్వహించడానికి అవసరమైన మొత్తాన్ని శ్రీవాణి ట్రస్ట్ నుంచే కేటాయిస్తోంది.
నిధులు ఏమయ్యాయ్
ఇప్పటిదాకా శ్రీవాణి ట్రస్ట్కు అందిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలంటూ తాజాగా ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అందిన విరాళాలు మొత్తం.. చేసిన ఖర్చుల గురించి సామాన్య ప్రజలకు తెలియజేయాలని ఆయన టీటీడీ అధికారులకు సూచిస్తోన్నారు. శ్రీవాణి ట్రస్ట్ విరాళాలను హిందూ ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించడం, దేవాలయాల నిర్మాణానికి ఖర్చు పెడతామని టీటీడీ వెల్లడించిందని గుర్తు చేశారు.
కట్టుబొట్టులో ఉంటే సరిపోదు..
ఇప్పటిదాకా విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఎన్ని? ఎంత ఖర్చు పెట్టారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు. ఆ బాధ్యత టీటీడీపై ఉందని తెలిపారు. ధర్మ పరిరక్షణ కోసం ఎంత కేటాయించారనేది తెలియజేయాలని డిమాండ్ చేస్తోన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కేవలం మాటలు, ప్రకటనలు, కట్టు బొట్టులో ఉంటే సరిపోదని, ఆచరణాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం చాలా ముఖ్యమని ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.