సెకండ్ ఇన్నింగ్స్: టీడీపీలోకి మాజీ సీఎం కిరణ్ రెడ్డి సోదరుడు..!
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా సేవలందించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే. కిరణ్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఆయన సోదరుడే అన్ని తానై చూసుకునే వారు.
రాష్ట్ర విభజన అనంతరం కిరణ్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ తరుపున కిశోర్ కుమార్ రెడ్డి తమ సొంత నియోజకవర్గం పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అటు కిరణ్తో పాటు కిశోర్ కూడా దాదాపుగా రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే మళ్లీ ఇప్పుడు కిశోర్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ బలహీనంగా ఉండటంతో కిశోర్ను చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
అంతేకాదు కిశోర్ను పార్టీలో చేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కిశోర్ను పార్టీలో చేర్పించుకునే విషయాన్ని ఇటీవల జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారని సమాచారం.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి సాధారణ ఎన్నికల్లో మదనపల్లె నుంచి శాసనసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కిషోర్కుమార్రెడ్డిని చేర్చుకుని ఆ స్థానం నుంచి మండలికి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారంట.