జగన్ని కలిసిన మాజీ డీజీపీ: విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సాంబశివరావు
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ మాజీ డీజీపీ సాంబశివ రావు శనివారం కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద పాదయాత్ర శిబిరానికి వచ్చిన సాంబశివరావు.. జగన్ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇరువురు సుమారు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు.
జగన్ను సాంబశివరావు కలవడంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వచ్చాయి. సాంబశివరావు త్వరలోనే తమ పార్టీలో చేరనున్నారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి కూడా చెప్పారు. ఇది శుభపరిణామం అన్నారు. సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
విజయసాయిరెడ్డి ప్రకటనపై మాజీ డీజీపీ
తాను వైసీపీలో చేరుతున్నట్టు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను ఏపీ మాజీ డీజీపీ సాంబశివ రావు వెంటనే ఖండించారు. జగన్ను కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్ను కలిశానని చెప్పారు. గతంలో సీపీగా పని చేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని తెలిపారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు.
కాగా, గతంలో సాంబశివ రావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సాంబశివ రావు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇంచార్జ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో ఆదిలాబాద్ ఏఎస్పీగా బాధ్యలు చేపట్టిన అంచెలంచెలుగా ఎదిగారు. ఏపీలోని ఒంగోలులో మిరియాలపాలెంకు చెందిన రామకోటయ్య, సూరలమ్మకు జన్మించారు.