రైతు నుంచి.. అందుకే చంద్రబాబుకు దూరం: వంగవీటితో కాలేజీ నుంచే..
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన 22 జూన్ 1954లో విజయవాడలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు డాక్టర్ రామకృష్ణ వరప్రసాద్, రాధాకృష్ణమ్మ. ఈయన రెండో సంత
విజయవాడ: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన 22 జూన్ 1954లో విజయవాడలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు డాక్టర్ రామకృష్ణ వరప్రసాద్, రాధాకృష్ణమ్మ. ఈయన రెండో సంతానం.
నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. ఆయనకు గాంధీ (చంద్రశేఖర్), మురళీ, బాజీప్రసాద్ సోదరులు. బీఏ వరకు చదివిన దేవినేని నెహ్రూ.. తొలుత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టారు. ఆయన సతీమణి పేరు దేవినేని లక్ష్మి. కొడుకు (అవినాష్), కూతురు ఉన్నారు.
విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం టిడిపికి చేరింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కొద్ది నెలల క్రితమే తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎన్టీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా, వీరవిధేయుడిగా నెహ్రూకు పేరుంది.
దేవినేని నెహ్రూ రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత సూర్యనారాయణ నెప్పల్లి సర్పించిగా పని చేశారు. విద్యార్థి రాజకీయాల్లో నెహ్రూ చురుగ్గా పాల్గొన్నారు.
వంగవీటి రంగా సంస్థతో కాలేజీలోనే ఢీ
ఆయన ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుతుండగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ను స్థాపించారు. మరోవైపు, వంగవీటి రంగా యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ స్థాపించారు. ఈ రెండు సంస్థల మధ్య ఆధిపత్య పోరు ఉండేది.
1982లో టిడిపిలోకి..
దేవినేని నెహ్రూ 1982లో టిడిపిలో చేరారు. ఆ పార్టీ ప్రారంభంతోనే చేరారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు మూడు బస్సుల నిండా జనాన్ని తీసుకు వెళ్లారంటారు. ఎన్టీఆర్ విధేయుడైన నెహ్రూ అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఎన్టీఆర్ హయాంలో, అదీ ఎన్టీఆర్ ఉన్నప్పుడే నాలుగుసార్లు గెలిచారు.
1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1994 నుంచి 96వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్లో చేరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో..
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి టిడిపి అభ్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లోనూ ఆయనకు ఓటమి తప్పలేదు. విభజన కారణంగా ఏర్పడిన వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయనకు స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయారు.
ఎన్టీఆర్ వదులుకోలేదు
ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని నెహ్రూ చెప్పేవారు. 1989లో టిడిపి ఓటమికి ఉన్న కారణాల్లో నెహ్రూ కూడా ఒకరనే ఆరోపణలు వచ్చినా ఎన్టీఆర్ ఆయనను వదులుకోలేదు. అంతటి సాన్నిహిత్యం ఎన్టీఆర్తో నెహూకు ఉండేది. తామిద్దరిదీ తండ్రీకొడుకుల బంధం అని చెప్పేవారు.
1996లో టిడిపిని వీడారు..
1996లో టిడిపిలో చోటుచేసుకున్న మార్పుల్లో ఆయన ఎన్టీఆర్ పక్షానే నిలిచారు. ఎన్టీఆర్ మృతి అనంతరం దివంగత పీజే ఆర్, ఇతర కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్టీఆర్ను పదవిలో నుంచి దింపివేసిన కారణంగానే తాను టిడిపిని వీడినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలోను చెప్పారు. ఆ తర్వాత 2004లో ఆయన మరోసారి కంకిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు.
వారసుడిగా కొడుకు..
తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన తిరిగి టిడిపిలో చేరారు. ఈ మధ్యనే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడు దేవినేని అవినాష్ను వారసుడిగా ప్రకటించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో అనూహ్యంగా కన్నుమూశారు.
అవినాశ్ను వారసుడిగా ప్రకటించి విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. ఇందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. పలుమార్లు సీఎం చంద్రబాబు, టిడిపి సీనియర్ నేతలు, వర్గీయులతో చర్చించారని కూడా సమాచారం.
ఇరువురిలోను మొండితనం..
స్వర్గీయ ఎన్టీఆర్ అంటే నెహ్రూకు చాలా ఇష్టం. ఓ సమయంలో దేవినేని నెహ్రూ.. వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్తో సమానంగా పోల్చారు. కమిట్మెంట్, క్యారెక్టర్ తదితర విషయాల్లో ఇద్దరు ఒకే విధంగా ఉండేవారని, ఇద్దరిలోను మొండితనం చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
వంగవీటి ఫ్యామిలీతో దేవినేని ఫ్యామిలీకి రాజకీయ వైరం
బెజవాడలో వంగవీటి వర్సెస్ దేవినేని ఫ్యామిలీగా ఉండేది. రంగా కాంగ్రెస్ నేత. కాపు కమ్యూనిటీకి చెందిన వారు. వంగవీటి రంగా హత్య కేసులో నెహ్రూ సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. కానీ 2002లో కోర్టు నెహ్రూ సహా 33 మందిని నిర్దోషులుగా తేల్చింది.