జగన్ కేసుల విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే జైలుపాలు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే టీడీపీనే తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గత శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో అసలు ఏం జరగనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇక ఈ నేపధ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగ కేసుల వ్యవహారంలో ఏం జరుగుతుందో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా ప్రచారంపరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాజీ జేడీ
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారని, చట్టం ప్రకారం జరగాల్సింది జరుగుతుందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు ఒక కేసు కోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలో తాను అందరిలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని స్పష్టం చేశారు. ప్రతి కేసులోనూ విచారణ జరగడం, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో సమర్పించడం జరుగుతుందని చెప్పారు.
జగన్ కేసులోనూ విచారణ ఆధారంగానే నిర్ణయం
జగన్ కేసులో కూడా అదే జరిగిందని వాటి ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుని శిక్ష విధించడటమా? లేక మరేదైననా అని తేలుస్తుందని చెప్పారు. అనవసర ఊహాగానాలు అవసరం లేదని , చట్టం తనపని తాను చేస్తుందని చెప్పారు.వంద మంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అనేది భారతదేశ న్యాయ వ్యవస్థ సూత్రం అని పేర్కొన్నారు. జగన్ కేసు విషయంలోనూ విచారణ అదే విధంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు.
నేరం రుజువైతే శిక్ష .. లేదంటే నిర్దోషినే అన్న మాజీ జేడీ
తాను విచారణాధికారిగా ఉన్నప్పుడు దాఖలు చేసిన చార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించడం జరిగిందని తెలిపారు. వాటిపై ట్రయల్స్ నడుస్తున్నాయని వివరించిన ఆయన ఇరు పక్షాల వాదనలు ప్రతివాదనల అనంతరం నేరం రుజువని తేలితే కోర్టు శిక్ష విధిస్తుందని పేర్కొన్నారు.లేదంటే నిర్ధోషిగా ప్రకటిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పారు. మొత్తానికి సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలో గతంలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జగన్ కేసుపై వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికర అంశంగా చెప్పాలి .