పార్టీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయ భవిష్యత్తుపై తేల్చేశారు
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై బుధవారం స్పష్టత ఇచ్చారు. త్వరలో తాను కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. ఇటీవల ఆయన లోక్సత్తా పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పుడు ఆయన స్పందిస్తూ.. లోక్సత్తా బాధ్యతలు తీసుకోవాలని జయప్రకాశ్ నారాయణ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, దానిని పరిశీలిస్తున్నానని ఇటీవల చెప్పారు.
తాజాగా, ఈ రోజు పార్టీపై స్పష్టత ఇచ్చారు. తన రాజకీయ ప్రవేశం సొంత పార్టీ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. సన్నిహితులు, అభిమానుల సూచన మేరకు సొంత పార్టీ స్థాపించాలని నిర్ణయించానని చెప్పారు. కొత్త పార్టీ పేరు, విధి విధానాలు, ప్రారంభ తేదీ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.
లక్ష్మీనారాయణ ఏపీలోని 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. అనంతరం సోమవారం తన రాజకీయ రంగ ప్రవేశంపై సోమవారం సన్నిహితులతో హైదరాబాద్లో చర్చించారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. సొంతగా పార్టీ పెట్టాలా లేదా లోక్సత్తా పగ్గాలు చేపట్టాలా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.